ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్లు… అమెరికా – ఇరాన్ యుద్ధం వల్ల కాస్తా అటు పశ్చిమాసియాలో ఆందోళనలు, గల్ఫ్ లో కొత్త కష్టాలు, ఇక ప్రధానంగా హార్మూజ్ జలసంధి ద్వారా చమురు దిగుమతి చేసుకునే భారత్, చైనాలతో పాటు మరికొన్ని తూర్పు ఆసియా దేశాలకు కష్టాలు తప్పేలా లేదు. ఇప్పటికే భారత్ లో ఇటీవల కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో గ్యాస్ స్టౌల్ ల స్థానంలో కట్టేల పొయ్యిలు దర్శనమిచ్చాయి. పెట్రోలు బంకుల వద్ధ క్యూల సంగతి చెప్పే పనే లేదు! ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా మరో బాంబు పేల్చారు ట్రంప్.
చాలామంది భావించినట్లుగానే ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా చూసిన అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విఫలమయ్యాయి. సుమారు 21 గంటలపాటు జరిగిన చర్చల్లో ఇరుదేశాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు. దీంతో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా… పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు.. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం.. ఆకాశాన్నంటనున్న నిత్యావసర వస్తువుల ధరలు.. గల్ఫ్ లో కొనసాగనున్న పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎందుకంటే… చర్చలు విఫలమైన నేపథ్యంలో మరోసారి ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది. పైగా.. శాంతి చర్చలు ఫలించని నేపథ్యంలో ఈసారి అంతకు మించిన భీకర దాడులు చేస్తామని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు చేశారు. అదే జరిగితే.. ఇరాన్ ఎదురు దాడులు చేస్తుంది.. ఫలితంగా సౌదీ, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ తదితర దేశాలు మళ్లీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ గ్యాప్ లో హెజ్ బొల్లా గ్రూపు నాశనమే లక్ష్యంగా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రం చేస్తుంది.
ఇక్కడ మరో అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే… మళ్లీ దాడులు మొదలైతే హర్మూజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టుబిగిస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉంది. పోనీ భారత్, చైనా వంటి మిత్రదేశాలకు నౌకలను పంపాలని అనుకుంటే చాలు.. అని ఈ దేశాల ప్రజలు అనుకుందామనుకున్నా.. ఆ అవకాశం లేకుండా చేశారు ట్రంప్ తన తాజా పోస్టులో…!
ఇందులో భాగంగా… “చర్చలు విఫలమైన నేపథ్యంలో ట్రంప్ వద్ద ఉన్న అస్త్రం నౌకాదళంతో దిగ్బంధనమే.. ఇరాన్ నౌకలను ఉన్న ప్రదేశం నుంచి కదలనీయకుండా చేయడం వల్ల చమురు ఎగుమతులపై ఆధారపడిన ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పతనావస్థకు తీసుకెళ్లడమే.. ఫలితంగా.. టెహ్రాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దాని మిత్ర దేశాలైన చైనా, భారత్ పైనా ఈ ప్రభావం పడటమే..” అని వచ్చిన ఓ కథనాన్ని ట్రంప్ తన ట్రూత్ లో పోస్ట్ చేశారు. అంటే… తాను చెప్పాలనుకున్నది చెప్పేశారన్నమాటేగా..!
దీంతో… మరికొన్ని రోజుల్లో జరగనుంది ఇదే అని అంటున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా… పైన చెప్పుకున్నవన్నీ జరిగితే.. పెట్రోల్, డీజిల్ ధరలు ఊహించని స్థాయికి చేరుకోవచ్చు.. అనేక దేశాల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటొచ్చు.. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యానికి దారి తీయొచ్చు.
ప్రధానంగా… పశ్చిమాసియాలో యుద్ధం మరింత విస్తరించి, ఇంకా ఎక్కువ తీవ్ర రూపం దాలిస్తే.. అది భారత్ కూ ఇబ్బందే అని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే… భారతదేశ ఇంధన భద్రతకు హర్మూజ్ జలసంధి అత్యంత కీలకంగా ఉన్నందువల్ల.. సుమారు 140 కోట్ల మందికి పైగా జనాభా కలిగిన దేశానికి చమురు, సహజవాయువు సరఫరాలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది! అదే జరిగితే.. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. సో… అటు తిరిగి ఇటు తిరిగి భారత్ పైకి ట్రంప్ భారీ బాంబు పేల్చనున్నట్లయ్యిందన్నమాట.
