తెలంగాణా.. పాకిస్థానా? కామెంట్ : పవన్ పై పోలీస్ కేసు

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్‌కళ్యాణ్‌ శుక్రవారం భీవమరం సభలో మాట్లాడుతూ… తెలంగాణా.. పాకిస్థానా?, అంటూ సిఎం కెసిఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పవన్‌కళ్యాణ్‌పై కేసు నమోదు అయ్యింది.

రాష్ట్ర అడ్వొకేట్ జేఏసీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం భీమవరంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం పవన్ కల్యాణ్ పర్యటించిన వేళ, పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం పాకిస్థాన్ లా మారిందని నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.

పవన్ మాట్లాడుతూ… ”విభిన్న సామాజికవర్గాలు, మతాల పేరుతో మనలోమనం ఇక్కడ కొట్టుకుంటున్నాం. కానీ, తెలంగాణకెళ్తే మనందరినీ కలిపి ఆంధ్రావాళ్ల కింద కొడుతున్నారు. దళితులు, క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు ఎవరైనా… తెలంగాణ వారికి మాత్రం మనం ఆంధ్రులం” అని ఆయన అన్నారు.

“జనసేనలో చేరాలనుకున్న నాయకులను టీఆర్‌ఎస్ నేతలు భయపెట్టి వైసీపీలో చేరేలా చేశారు. జగన్‌కు కేసీఆర్‌ అంటే భయం. కేసీఆర్‌ ఒక ఉద్యమనాయకుడన్న గౌరవం ఉంది కానీ, ఆయనంటే నాకు భయం లేదు. తెలంగాణలో ఉన్న నా ఇంటిని, పదెకరాల భూమిని లాక్కుంటారా? ఏం… తెలంగాణ పాకిస్తాన్‌ అనుకుంటున్నారా? ఇక్కడికి వచ్చి ఏపీ రాజకీయాలను మార్చేస్తారా?” అని పవన్ వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల్లో లబ్ది కోసం ఆయన తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ పై నోరు పారేసుకుంటున్నారని అడ్వొకేట్ జేఏసీ ఫిర్యాదు చేసింది.