పుష్ప మూవీ షూటింగ్‌లో విషాదం.. గుండెపోటుతో ఆ ఫొటోగ్రాఫర్ మృతి

అల్లు అర్జున్ కొత్త చిత్రం పుష్ప షూటింగ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ స్టిల్ ఫొటో గ్రాఫర్ జి.శ్రీనివాస్ గురువారం రాత్రి గుండెపోటుతో మరణించారు. అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమా షూటింగ్.. ప్రస్తుతం మారేడుమిల్లి అడవుల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూవీ యూనిట్ అంతా ఇప్పుడు మారేడుమిల్లి అడవిలో ఉంది.

అయితే, పుష్ప మూవీకి స్టిల్ ఫొటో గ్రాఫర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటుతో కుప్పకూలిపోయారు. యూనిట్ సిబ్బంది ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్‌లో రాజమండ్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే ఆయన్ను కన్నుమూశారు.

54 ఏళ్ల శ్రీనివాస్ దాదాపు 200 పైగా సినిమాలకు స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆయనకు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గతంలో కూడా పుష్ప మూవీ యూనిట్‌లో కరోనా కలకలం రేగింది. అప్రమత్తమైన దర్శకనిర్మాతలు.. వెంటనే షూటింగ్ అంతా నిలిపివేసి హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. ఇప్పుడు ఏకంగా స్టిల్ ఫొటోగ్రాఫర్ గుండెపోటుతో మరణించడంతో పుష్ఫ యూనిట్‌లో విషాదం నెలకొంది. పుష్ఫ మూవీ విడుదల తేదీని గురువారమే ప్రకటించారు. ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.