‘మేమే అధికారంలోకి వస్తాం’ అంటోంది జనసేన పార్టీ. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీకి వున్న బలమెంత.? ఆ పార్టీకి వున్న ఓట్ల శాతం.. పోటీ చేసే సీట్లు.. వీటి సంగతేంటి.? మార్చి 14న మచిలీపట్నంలో నిర్వహించబోయే బహిరంగ సభతో తమ సత్తా ఏంటో చాటి చెబుతామంటున్నారు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్.
కానీ, ‘నాదెండ్ల మావాడే.. మేం చెప్పినట్లే వింటాడు’ అంటోంది టీడీపీ. ఈ సందట్లో టీడీపీ అనుకూల మీడియా నుంచి ఓ సర్వే వచ్చింది. ఆ సర్వే ప్రకారం జనసేన పార్టీకి కేవలం 7 సీట్లు మాత్రమే వస్తాయట. టీడీపీ 80కి పైగా సీట్లలో గెలుస్తుందిట. వైసీపీ కేవలం అరవై సీట్లకు పరిమితమవుతుందిట. మరి, మిగతా సీట్ల మాటేమిటి.?
అంటే, ఆ మిగిలిన సీట్లలో పోటీ చాలా గట్టిగా వుండబోతోందన్నది సదరు టీడీపీ అనుకూల మీడియా కథనాల సారాంశం. మిత్రపక్షం కదా, జనసేన పార్టీకి ఓ పాతిక సీట్లన్నా ఆ సర్వేలో టీడీపీ ఎందుకు ఇప్పించుకోలేకపోయింది.? అయితే టీడీపీ అధికారంలో వుండాలి.. లేదంటే వైసీపీ అధికారంలో వుండాలి.. జనసేనకు ఎందుకు అధికారమిస్తాం.? అన్నట్టుంది రెండు పార్టీల తీరు.
వైసీపీ, టీడీపీ గోల సంగతి పక్కన పెడితే, జనసేన పార్టీకి ఈ సర్వే మింగుడు పడ్డంలేదు. ‘మేం యాభై సీట్లు గెలుస్తాం’ అంటున్నారు వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లు కొందరు. ‘అన్ని స్థానాల్లో కనీసం పోటీ చేసే సత్తా వుందా.?’ అంటూ ఏకిపారేస్తున్నారు టీడీపీ, వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లు.
కాలచక్రం గిర్రున తిరిగేసింది. ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయ్.! జనసేన పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుంది. డబుల్ డిజిట్ దాటడం కనాకష్టమవుతుందా.? అసలు ఒక్క సీటైనా జనసేన గెలుస్తుందా.?
