Infosys: ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ ఐటీ పటంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) విస్తరణకు మార్గం సుగమం చేస్తూ, విశాఖపట్నంలో 20 ఎకరాల విలువైన స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
విశాఖ కేంద్రంగా ఇన్ఫోసిస్ సుమారు రూ. 750 కోట్ల భారీ పెట్టుబడితో తన నూతన క్యాంపస్ను నిర్మించనుంది. ఈ మెగా ప్రాజెక్ట్ ద్వారా ప్రారంభ దశలోనే సుమారు 7,000 మంది సాఫ్ట్వేర్ నిపుణులకు ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఐటీ మరియు ఐటీఈఎస్ (ITeS) రంగాల్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ వంటి విభాగాలకు విశాఖపట్నం గ్లోబల్ సెంటర్గా అవతరించనుంది.
ఇన్ఫోసిస్ వంటి అంతర్జాతీయ బ్రాండ్ తన కార్యకలాపాలను విస్తరించడం వల్ల ఏపీ ఐటీ రంగానికి కొత్త ఊపు రానుంది. వేల సంఖ్యలో నిపుణులు రావడం వల్ల స్థానిక రియల్ ఎస్టేట్, రవాణా, మరియు సేవా రంగాలకు భారీగా డిమాండ్ పెరిగి ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.

ఇన్ఫోసిస్ రాకతో ఇతర గ్లోబల్ ఐటీ కంపెనీలు కూడా విశాఖ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ఐటీ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల సొంత రాష్ట్రంలోనే కొలువులు దొరికే అవకాశం ఉండటంతో, ఇతర నగరాలకు వెళ్లిన ఏపీ యువత తిరిగి వచ్చే (Reverse Migration) అవకాశం ఉంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ రంగానికి పెద్దపీట వేస్తోంది. విశాఖను ఐటీ రాజధానిగా మార్చాలనే సంకల్పంతో తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో మైలురాయిగా నిలవనుంది. త్వరలోనే ఈ క్యాంపస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగనున్నట్లు సమాచారం.

