Court Politics : కోర్టులో దొంగలు పడ్డారు.. కుట్ర ఎవరిది.? రాజకీయం ఎవరిది.?

Court Politics : నెల్లూరు జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. కోర్టులో దొంగలు పడ్డారు. దొంగలు పోలీసులకు చిక్కితే, తొలుత పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి ఆ తర్వాత కోర్టులో హాజరు పరుస్తారు. చేసిన నేరానికి ఏ శిక్ష వేయాలన్నది కోర్టు తేలుస్తుంది.
మరిప్పుడు కోర్టులోనే దొంగతనం జరిగితే, ఏమనాలి.? దొంగలకి కోర్టు మీద ఎందుకు కన్నమేయాలని అనిపించింది. దీని వెనుక రాజకీయమేంటీ.? కుట్ర కోణమేంటీ.? ఇద్దరు రాజకీయ ప్రముఖుల మధ్య ఆధిపత్య పోరు.. ఈ క్రమంలో పెట్టుకున్న కేసులు ఆ వ్యవహారానికి దొంగతనంతో లింకు.. ఇదీ అసలు కథ.
వివరాల్లోకి వెళితే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి కొన్నాళ్ల క్రితం తనపై అభ్యంతరకర రాజకీయ ఆరోపణలు చేసినట్లు కాకాణి గోవర్దన్ రెడ్డి మీద కేసు వేశారు. అది కూడా ఫోర్జరీ కేసు. ఆ కేసు విచారణలో వుంది. కాలం గిర్రున తిరిగింది. సోమిరెడ్డి మాజీ మంత్రి అయ్యారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే మంత్రి అయ్యారు.
ఇంతలోనే అనూహ్యంగా ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లు కోర్టు నుంచి దొంగతనానికి గురయ్యాయ్. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశంలో చాలా కోర్టులున్నాయ్. గతంలో ఇలాంటి దొంగతనాలు ఎక్కడైనా జరిగాయా.? ఏమో జరిగి వుండొచ్చేమో.!
అయినా, కోర్టు ఫైళ్లు దొంగతనం చేస్తే ఏమి వస్తుంది.? ఏమీ రాదు. కానీ, దొంగతనం జరిగింది.. అంటే ఖచ్చితంగా దీని వెనుక రాజకీయ కుట్ర వుండి వుండాలి. అయితే, ఆ కుట్రకి పాల్పడిందెవరు.? అన్నదే సస్పెన్సే.!