రఘురామ బాటలో కోటంరెడ్డి.! సేమ్ స్క్రిప్ట్.!

పెద్దగా తేడా ఏం లేదు.. నర్సాపురం ఎంపీ రఘురామృష్ణరాజులాగానే, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం కూడా. కాకపోతే, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు.. అంతే తేడా. వైసీపీని ఆయన దాదాపు వీడినట్లే. వైసీపీ ఎలాగూ ఆయన్ని గెంటేయదు.. రఘురామకృష్ణరాజులాగానే. పోనీ, కోటంరెడ్డి ఏదన్నా పార్టీలో చేరగలరా.? అంటే, అదీ కష్టమే.. సేమ్ టు సేమ్ రఘురామకృష్ణరాజు తరహాలోనే. రఘురామ రచ్చబండ పేరుతో నానా యాగీ చేస్తున్నారు.. కోటంరెడ్డి తన రెగ్యులర్ కార్యక్రమాలకి ఇంకా పేరు పెట్టుకోలేదు.

కార్యక్రమాలంటే ఏమీ కాదు.. వైసీపీని విమర్శించడమే. అలా వైసీపీని విమర్శించారో లేదో.. ఇలా టీడీపీ అనుకూల మీడియా నుంచి కోటంరెడ్డికి పిలుపు వచ్చేసింది.. వైసీపీ నేతలెలాగూ టీడీపీ అనుకూల మీడియాలో కనిపించరు. వైసీపీ రెబల్ నేతలకు మాత్రం, టీడీపీ అనుకూల మీడియాలో స్పెషల్ ఫోకస్ దక్కుతుంది.

ఇంతకీ, రఘురామకృష్ణరాజుకి జరిగిన కుమ్ముడు వ్యవహారం, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికీ జరుగుతుందా.? ఈ అనుమానం, సీనియర్ జర్నలిస్టు ఆర్కేకి వచ్చింది. తన ఏబీఎన్ మీడియా సంస్థ ద్వారా ఈ ప్రశ్న కోటంరెడ్డికి సంధించేశారు వేమూరి రాధాకృష్ణ.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి జరిగిన సీఐడీ సత్కారం లాంటిదే, కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డికీ త్వరలో జరుగుతుందని టీడీపీ అనుకూల మీడియా అంటోంది. ఏమో, జరుగుతుందేమో.! ఆ సంగతి తర్వాత.. రఘురామ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకం. కోటంరెడ్డిది కూడా సేమ్ టు సేమ్.!