తెలంగాణలో మహాకూటమి కొత్త పేరు ఇదే

తెలంగాణలో మహాకూటమికి తెలంగాణ పరిరక్షణ వేదికగా నాయకులు పేరు ఖరారు చేశారు. కూటమికి చైర్మన్ గా కోదండరామ్ ని నాయకులు అంగీకరించారు. దీంతో రేపటి నుంచి నాయకులు ప్రచార పర్వం ప్రారంభించనున్నారు. తెలంగాణ పరిరక్షణ వేదిక నాయకులంతా రెండు రోజుల్లో మరో సారి సమావేశం కానున్నట్టుగా తెలుస్తోంది. కూటమిలో కాంగ్రెస్, సీపీఐ, టిడిపి, టిజెఎస్, తెలంగాణ ఇంటి పార్టీ లు ప్రస్తుతం ఉన్నాయి.

వారంలో నాలుగు పార్టీల నేతలు దాదాపు మూడు సార్లు భేటి అయ్యారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. వీటన్నింటి పరిష్కారం కోసమే ముందుగా సమావేశమై కూటమి పేరు ఖరారు చేసుకున్నట్టు నేతలు తెలిపారు. త్వరలోనే ఉమ్మడి మ్యానిఫెస్టోను కూడా విడుదల చేస్తామన్నారు. అన్ని పార్టీల నుంచి వచ్చిన వినతుల మేరకు సలహాలతో మ్యానిఫెస్టోను ప్రకటిస్తామన్నారు.

రేపు ఉదయం నుంచి కాంగ్రెస్ తన ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. గద్వాలలోని జోగులాంబ అమ్మవారికి పూజలు చేసి కాంగ్రెస్ నేతలు ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. మిగిలిన పార్టీల నేతలు కూడా తమ తమ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టుగా తెలుస్తోంది.