ప్రజా వేదిక కొట్టినందుకు కాదా టిడిపి బాధ?

గత నాలుగు రోజులుగా ప్రధానమైన చర్చ ప్రజా వేదిక. ప్రజా వేదికని కూల్చివేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించగానే తెలుగుదేశం ఒంటికాలిపై లేచింది. 10 కోట్లు ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ప్రజా వేదికని కూల్చివేయడం అవివేకమని కక్ష సాధింపు చర్య అని తెలుగుదేశం గగ్గోలు పెట్టింది.

మరోపక్క వైఎస్సార్ కాంగ్రెస్ ఈ ఆరోపణలుకి వెరవకుండా  ప్రజా వేదికని కూల్చివేసింది. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన ఎలా ఉందంటే ప్రక్షాళన ప్రభుత్వంతోనే మొదలవ్వాలి. అందుకే రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలని రాజధాని నుంచి ప్రారంభించాం. 

10 కోట్లు వెచ్చించి కట్టిన భవనం పడగొట్టడానికి ప్రభుత్వానికి 10 గంటలు కూడా పట్టలేదు. ఎంతో గంభీరంగా కనిపించిన ప్రజా వేదిక కొట్టడం మొదలు పెట్టాక పేకమేడలా కూలిపోయింది. విపరీతమైన టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో ఆ దృశ్యాలు రాష్ట్రం నలుమూలలకు అతి తక్కువ సమయంలో చేరిపోయాయి. 

అనవసరంగా ప్రజాధనం వెచ్చించి కట్టిన భవనాన్ని కూల కొడుతున్నారు అనే భావనలో ఉన్న తటస్థ ప్రజానీకం కూడా ప్రజా వేదిక కట్టిన తీరు చూసిన తర్వాత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ మాత్రం కట్టడానికి 10 కోట్లు ఖర్చు పెట్టారా అని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అక్రమ కట్టడం కట్టారు అనే అపవాదు కంటే కూడా అది కట్టిన విధానం, ప్రజాధనం వెచ్చించిన విధానం తెలుగుదేశం ప్రతిష్టని మరింత దిగజార్చాయి.