ఔను, టీడీపీకి వేరే శతృవులక్కర్లేదు.!

విషయం చాలా చిన్నదే.! కానీ, గొడవ చాలా చాలా పెద్దదైపోయింది.! సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి నోటి దురుసు చాలా చాలా ఎక్కువ. ఇది అందరికీ తెలిసిన విషయమే. నోటి దురుసు మాత్రమే కాదు, చేతి దురద కూడా చాలా చాలా ఎక్కువ.

స్వర్గీయ ఎన్టీయార్ వర్ధంతి నేపథ్యంలో, హైద్రాబాద్‌లోని ఎన్టీయార్ ఘాట్ వద్ద అభిమానులు కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాళ్ళు జూనియర్ ఎన్టీయార్‌కి వీరాభిమానులు. ఆ ఫ్లెక్సీలను తొలగించాలంటూ నందమూరి బాలకృష్ణ, తన సన్నిహితుల్ని ఆదేశించారు. అప్పటికప్పుడు వాటిని తొలగించారు కూడా.

‘తీయించెయ్.. వెంటనే..’ అంటూ నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారంపై జూనియర్ ఎన్టీయార్ అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ ఈ తరహా ఫ్లెక్సీలు పెట్టినా, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదన్నది వారి ఆవేదన.

టీడీపీకి మద్దతిచ్చే విషయమై తానూ, తన తమ్ముడు జూనియర్ ఎన్టీయార్ కలిసి నిర్ణయం తీసుకుంటామంటూ ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలతో దుమారం చెలరేగింది. అంటే, టీడీపీతో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీయార్ కలిసి లేరన్నమాట.. అన్న సంకేతాలు వెళ్ళాయి.

వాస్తవానికి ఫ్లెక్సీల గొడవ చాలా చిన్నదే. అభిమానులు, తమ అభిమాన హీరోల్ని ఫ్లెక్సీలతో ఇరిటేట్ చేస్తుంటారు. అవి ఇబ్బందికరంగా, ప్రమాదకరంగానూ వుంటాయి ఒక్కోసారి. ఎన్టీయార్ ఘాట్ వద్ద ఫ్లెక్సీల విషయమై అసలేం జరిగింది.? అన్నది తేలాల్సి వుంది.

కానీ, అందరి ముందర, ‘తీయించెయ్.. వెంటనే’ అని బాలయ్య హుకూం జారీ చేయడం, సహజంగానే జూనియర్ ఎన్టీయార్ అభిమానులకి కోపం తెప్పించింది. ‘మేం టీడీపీని ముంచేస్తాం..’ అంటూ జూనియర్ ఎన్టీయార్ అభిమానులు శపథం చేస్తున్నారిప్పుడు. కేవలం సినీ నటుడే అయితే, నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదు. ఆయన టీడీపీ ఎమ్మెల్యే కూడా.! టీడీపీకి వేరే శతృవులు అక్కర్లేదు, బాలయ్య వున్నాడు కదా.!