తెలుగుదేశానికి సీక్వెల్‌గా జ‌న‌సేన పార్టీ

జనసేన పార్టీ తెలుగుదేశానికి సీక్వెల్‌గా మారింది. టీడీపీకి నంబ‌ర్‌-2గా వ్య‌వ‌హ‌రిస్తోంది. టీడీపీ నిరాక‌రించిన‌, పొగ‌బెట్టిన నాయ‌కుల‌ను ఆశ్ర‌యం క‌ల్పిస్తోంది ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన త‌రువాతే తాము జాబితా విడుద‌ల చేస్తామంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన ఓ ప్ర‌క‌ట‌న వెనుక ఉన్న అస‌లు కార‌ణం కూడా అదే అంటున్నారు.

తమ‌కు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇన్‌ఛార్జిలు ఉన్నార‌ని, కొత్త వారిని తీసుకుంటే ఇబ్బందులు వ‌స్తాయంటూ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న ఓ ర‌కంగా ఆశావ‌హుల్లో క‌ల‌క‌లాన్ని రేపింది. తెలుగుదేశంలో ఇమ‌డ‌లేక‌, జ‌గ‌న్ పార్టీ వైపు ఇన్నాళ్లూ ఆశ‌గా చూస్తూ వ‌చ్చిన నాయ‌కులకు ఇక మిగిలిన ప్ర‌త్యామ్నాయం జ‌న‌సేనే.

విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన విధంగా అసెంబ్లీ సీట్ల‌ను పెంచుతామ‌ని, కొత్తగా వ‌చ్చిన స్థానాల్లో టికెట్లు ఇస్తామ‌నీ చంద్ర‌బాబు ఆశ‌పెట్టి 23 మంది ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను టీడీపీలోకి లాక్కున్నారు. ఇప్పుడు వాళ్ల‌ని కూడా అకామ‌డేట్ చేయాల్సి ఉంది. చంద్ర‌బాబు ఊహించిన‌ట్లు అసెంబ్లీ సీట్లు పెర‌గ‌లేదు. 2014 నాటికి రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో.. అన్ని స్థానాలే ఇప్పుడూ ఉన్నాయి.

ఎప్పుడో పెరిగే సీట్లను ఎరగా వేసి, వైఎస్ఆర్ సీపీ నుంచి ఎమ్మెల్యేలను తెచ్చుకున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడింది. ఇప్పటికే టీడీపీ ఇన్‌ఛార్జీలు బలంగా ఉన్న చోట్ల `ఫిరాయింపు` ఎమ్మెల్యేలను ఎలా నిలబెడతారనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. ఉదాహరణకు జమ్మలమడుగును తీసుకోవచ్చు. ఇక్కడి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి చేర్చుకున్నారు. మంత్రి పదవినీ కట్టబెట్టారు.

అప్పటికే జమ్మలమడుగులో ఉన్న పార్టీ సీనియర్ నాయకుడు రామసుబ్బారెడ్డికి నచ్చజెప్పి ఎమ్మెల్సీ ఇచ్చారు. `కొని` తెచ్చుకున్న 23 స్థానాల్లోనూ ఇదే ఫార్ములా పని చేయదు. క‌దిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ పాత కాపు కందికుంట బ‌ల‌మైన నాయ‌కుడే. ఆయ‌న‌ను కాద‌ని ప్ర‌తిప‌క్షం నుంచి అత్త‌ర్ చాంద్‌భాషాను పార్టీలో చేర్చుకున్నారు. ఒక్క క‌దిరి నియోజ‌క‌వ‌ర్గంలో వారిద్ద‌రికీ ఎలా టికెట్ల‌ను స‌ర్దుబాటు చేస్తారు?

క‌దిరి నియోజ‌క‌వ‌ర్గంలో ముస్లిం ఓటుబ్యాంకు ఎక్కువ‌. అలాగ‌ని టీడీపీ త‌ర‌ఫున చాంద్‌భాషాకు మ‌ళ్లీ టికెట్ ఇస్తే గెల‌వ‌డం క‌ష్ట‌మే. వైఎస్ఆర్ సీపీ క్యాడ‌ర్ బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం అది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? అందుకే- ఒక్కొక్కరినీ చంద్రబాబు దగ్గరుండి మరీ జనసేనలోకి పంపించి వేస్తున్నారు. ఇది అఖిల ప్రియతో ఆరంభమైందా? అనే అభిప్రాయం జనంలో నెలకొంది.

అనంత‌పురం మొద‌లుకుని శ్రీ‌కాకుళం దాకా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. అయిదారుమంది త‌ప్పించి, పార్టీ ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు అభ‌ద్ర‌తాభావం నెల‌కొంది. అఖిల‌ప్రియ ఎదుర్కొంటున్న దుస్థితి చూసిన త‌రువాత వారిలో ఈ భ‌యం మ‌రింత పెరిగింది. పార్టీ ఫిరాయించిన క‌ల‌మ‌ట వెంక‌ట‌ర‌మ‌ణ (పాత‌ప‌ట్నం), వ‌రుపుల సుబ్బారావు (ప్ర‌త్తిపాడు) జ‌న‌సేన‌లో చేర‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని చెబుతున్నారు. వ‌రుపుల జ‌న‌సేన‌లో చేర‌డం దాదాపు ఖాయ‌మైన‌ట్టేనట‌.

ఈ రెండు స్థానాల్లోనూ టీడీపీ పాత‌కాపుల‌కు టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అదే జిల్లాలోని జ‌గ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు ఉప ముఖ్య‌మంత్రి చిన‌రాజ‌ప్ప అండ ఉండ‌టం వ‌ల్ల ఈ సారి టీడీపీ నుంచి టికెట్ ద‌క్కొచ్చ‌ని స‌మాచారం. కృష్ణా జిల్లా పామ‌ర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్ప‌న‌, విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్‌ల‌కు ప్ర‌త్యామ్నాయాల‌ను వెదుకుతోంద‌ట టీడీపీ. స‌రైన అభ్య‌ర్థులు దొరికితే వారికి ద‌క్కేది మొండిచెయ్యే.

ప్ర‌కాశం జిల్లా అద్దంకిలో ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌, టీడీపీ ఇన్‌ఛార్జి క‌ర‌ణం బ‌ల‌రాం మ‌ధ్య ఎన్నిసార్లు గొడ‌వ‌లు జ‌రిగాయో.. ఎన్నిసార్లు వారిద్ద‌రూ జ‌నం ముందు బూతులు తిట్టుకున్నారో స్థానికుల‌కు బాగా తెలుసు. వారిద్ద‌రి పంచాయితీ చాలాసార్లు చంద్ర‌బాబు వ‌ద్ద‌కు చేరింది. ఇప్పుడు టికెట్ వ్య‌వ‌హారంలోనూ మ‌రోసారి ఇద్ద‌రూ కొట్టుకోక త‌ప్ప‌ద‌ని అంటున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు ఫిరాయింపు ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌కు ప్ర‌త్యామ్నాయ అభ్య‌ర్థిని టీడీపీ రెడీ చేసుకుంద‌ని స‌మాచారం.

క‌ర్నూలు జిల్లాలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. మంత్రి అఖిల‌ప్రియ వ్య‌వ‌హార‌మే దీనికి నిద‌ర్శ‌నం. త‌న‌కు మూడు సీట్లు ఖరారు చేస్తే.. జ‌న‌సేన‌లో చేర‌తాన‌ని ఆమె ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సంకేతాలు కూడా పంపించారు. ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల‌, క‌ర్నూలు సీట్ల‌ను ఆమె అడుగుతున్నారు. క‌ర్నూలు ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డి ప‌రిస్థితి కూడా అంతంత మాత్ర‌మే. అక్క‌డ టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు, మాజీ మంత్రి టీజీ వెంక‌టేష్ సూచించిన వారికి లేదా ఆయ‌న కుటుంబీకుల‌కు టికెట్ ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

త‌న మేన‌మామ ఎస్వీ మోహ‌న్ రెడ్డి, సోద‌రుడు బ్ర‌హ్మానంద రెడ్డిల‌తో క‌లిసి అఖిల‌ప్రియ ప‌వ‌న్ పార్టీలో చేర‌వ‌చ్చని తెలుస్తోంది. ఇదే జిల్లాల‌కు చెందిన మ‌రో ఇద్ద‌రు ఫిరాయింపు ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖ‌ర్ రెడ్డి (శ్రీ‌శైలం), మ‌ణిగాంధీ (కోడుమూరు) ఉన్నారు. వారిలో బుడ్డాకు టికెట్ ద‌క్కొచ్చ‌ని చెబుతున్నారు.

బుడ్డా కుటుంబం ముందు నుంచీ టీడీపీలో కొన‌సాగ‌డంతో పాటు, మొన్న‌టిదాకా శ్రీ‌శైలం ఇన్‌ఛార్జిగా ఉన్న శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి వైఎస్ఆర్ సీపీలో చేర‌డంతో ప్ర‌త్యామ్నాయ అభ్య‌ర్థి ఎవ‌రూ లేర‌ని అంటున్నారు. ఇక్క‌డ బుడ్డా సేఫ్ అయిన‌ట్టే. మ‌ణిగాంధీ అడ‌క‌త్తెర‌లో ప‌డ్డారు.

కోట్ల‌కు అమ్ముడు పోయి, రాజ‌కీయ జీవితాన్ని నాశ‌నం చేసుకున్నాన‌ని మ‌ణిగాంధీ బాహ‌టంగానే వాపోయారు. ఆయ‌న‌కు ఇక్క‌డ టికెట్ క‌ష్ట‌మే. చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరులో మంత్రి ఎన్ అమ‌ర్‌నాథ్ రెడ్డి టికెట్ ఖాయ‌మే. ఇక్క‌డ మ‌రో అభ్య‌ర్థి లేరు. టికెట్ ద‌క్క‌ని ఫిరాయింపు ఎమ్మెల్యేలంద‌రూ క‌ట్ట క‌ట్టుకుని జ‌న‌సేన‌లో చేరే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఆ రెండు పార్టీల త‌రువాతే తాము అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తామంటూ ప‌వ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న దీనికి బ‌లాన్ని ఇస్తోంది.