‘జనసేన’కి ‘జై’ కొట్టిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ‘జై జనసేన’ అంటూ నినదించారు. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ – జనసేన పార్టీ సంయుక్తంగా నిర్వహించిన ‘సమన్వయ కమిటీ సమావేశం’లో బాలకృష్ణ పాల్గొన్నారు.

టీడీపీ కండువాని మెడలో వేసుకుని బాలయ్య సందడి చేస్తే, ఆయనకు జనసేన కండువా కప్పారు స్థానిక జనసేన నేతలు. ఈ క్రమంలో ‘జై జనసేన’ అంటూ నందమూరి బాలకృష్ణ నినదించడంతో సందడి వాతావరణం నెలకొంది ఇరువర్గాల్లో.

మెగా వర్సెస్ నందమూరి.. ఈ సినీ వైరం ఈనాటిది కాదు. ఇది ఆరోగ్యకరమైన పోటీ తప్ప, బాలయ్యతో తనకెలాంటి విభేదాల్లేవని పలు సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. కానీ, మెగా కుటుంబాన్ని పలు సందర్భాల్లో చులకన చేసేలా నందమూరి బాలకృష్ణ మాట్లాడిన విషయం విదితమే.

బాలయ్య మీద నాగబాబు సెటైర్లు, నాగబాబు మీద బాలయ్య కౌంటర్ ఎటాక్స్ తెలిసిన విషయాలే. పవన్ కళ్యాణ్ మీద కూడా బాలయ్య గతంలో సెటైర్లు వేశారు. కానీ, చిరంజీవి కావొచ్చు.. పవన్ కళ్యాణ్ కావొచ్చు.. ఏనాడూ బాలయ్య మీద విమర్శలు చేయలేదు. పైగా, చిరంజీవి ‘బాలయ్యది చిన్న పిల్లాడి మనస్తత్వం’ అని లైట్ తీసుకున్నారు.

సరే, ఆ సంగతులు పక్కన పెడితే, వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయనున్నాయి. ఈ క్రమంలోనే ‘సమన్వయ కమిటీల సమావేశాలు’ జరుగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడంలేదుగానీ, జనసేన పార్టీ పోటీ చేస్తోంది. అయితే, ఇక్కడ టీడీపీ మాత్రం కాంగ్రెస్‌కి పరోక్షంగా మద్దతిస్తోంది.

‘జై జనసేన’ అని బాలయ్య నినదించడం ఆలస్యం, తెలంగాణ తెలుగు తమ్ముళ్ళ ఆలోచన మారింది.! అది జనసేనకు మేలు చేస్తుందా.? వేచి చూడాలిక.