జనసేన వల్లనే ఓడిపోయాంటోన్న టీడీపీ నేతలు.!

‘మేం గెలిచేవాళ్ళమే.. కానీ, అప్పట్లో చిరంజీవి దెబ్బ కొట్టినట్లుగానే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టాడు..’ అంటూ టీడీపీ నేతలు కొందరు గుక్కపెట్టి మరీ ఏడ్చేస్తున్నారు. ఇదో వింత.!

టీడీపీ – జనసేన కలిసి పోటీచేయబోతున్నాయి వచ్చే ఎన్నికల్లో. అలాంటప్పుడు, ఈ పంచాయితీ ఇప్పుడెందుకు.? ‘మీ వల్లనే మేం ఓడిపోయాం..’ అంటూ చిరంజీవిపైనా, పవన్ కళ్యాణ్‌పైనా టీడీపీ ఏడిస్తే, పొత్తులు కుదిరినా కుదరకపోయినా.. టీడీపీ మరింత నష్టపోతుందన్నది నిర్వివాదాంశం.

‘ఇంతకన్నా ఉదాహరణ ఇంకేం కావాలి.? టీడీపీ – జనసేన పొత్తు వల్ల ఉపయోగం వుండదు. టీడీపీ ఓట్లు జనసేనకు పడవు.. జనసేన ఓట్లు టీడీపీకి ఎలా పడతాయి.?’ అంటూ జనసేన కార్యకర్తలు కొందరు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

‘పొత్తులకు అనుకూల పరిస్థితి వుంది. అయితే, పొత్తులన్నవి ఎన్నికల ముందర ఖరారవుతాయి. పవన్ కళ్యాణ్ దేన్నీ కొట్టి పారేయడంలేదు. ప్రస్తుతానికి జనసేన పార్టీ, జనంలోకి మరింత సమర్థవంతంగా వెళ్ళడంపై దృష్టిపెట్టింది’ అని జనసేన నేతలు కొందరు చెబుతున్న సంగతి తెలిసిందే.

ఏదో ఒకటి తేల్చేయాలని టీడీపీ కూడా అనుకోవడంలేదు. చివరి నిమిషంలో ప్లేటు ఫిరాయించడం టీడీపీకి కొత్త కాదు. ఆ దింపుడు కల్లెం ఆశ మీద బతుకుతున్న కొందరు టీడీపీ నేతలు, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నారు.. గత ఎన్నికల్లో తమ ఓటమికి పవన్ కళ్యాణే బాద్యుడన్నట్టుగా.

సదరు నేతలకు, టీడీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కష్టమేనట కూడా.!