ప్రతిష్టాపనకు సిద్దమైన హరికృష్ణ విగ్రహం

తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎంపీ స్వర్గీయ నందమూరి హరికృష్ణ విగ్రహం రెడి అయ్యింది. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం బొమ్మినంపాడులోని శ్రీ సత్యలక్ష్మీ శిల్ప కళా కేంద్రంలో తీర్చిదిద్దారు. ఈ విగ్రహాన్ని శిల్పి ఇర్రింకి అప్పారావు తయారు చేశారు. దీనిని బాపులపాడు మండలం రేమల్లెలో ప్రతిష్టించేందుకు సిద్దమవుతున్నారు.

ఈ విగ్రహాన్ని వాట్సాప్ లో చూసిన హరికృష్ణ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారట. శిల్పి అప్పారావుతో పాటు ఆయన కుమారుడు బాలాజీ కూడా నెల రోజులుగా శ్రమించి హరికృష్ణ విగ్రహాన్ని రూపొందించారు.

నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో టిడిపి శ్రేణులు విషాదంలో మునిగి పోయారు. హరికృష్ణ గుర్తులు ప్రజలల్లో ఉండేందుకే ఆయన విగ్రహాన్ని తయారు చేయించినట్టు తెలుస్తోంది. అయితే ఈ విగ్రహాన్ని త్వరలోనే ప్రతిష్టించనున్నారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హరికృష్ణ కుటుంబ సభ్యులతోపాటు ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కానున్నట్టు తెలుస్తోంది.