ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్… తానాలో తన్నుకున్న తమ్ముళ్లు?

చాలా కాలంగా ఏపీ రాజకీయాల్లో, మరి ముఖ్యంగా టీడీపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్… నందమూరి వర్సెస్ నారా అనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీలో ఎక్కడ చంద్రబాబు, లోకేష్ ల సభలు పెట్టినా.. అక్కడ కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ప్రదర్శించడం.. జై ఎన్టీఆర్ అంటూ నినదించడం జరుగుతూనే ఉంది!

అయితే.. టీడీపీకి అసలు సిసలు వారసుడు, అందుకు అర్హుడు జూనియర్ ఎన్టీఆర్ అనేది కొంతమంది టీడీపీ కార్యకర్తల నమ్మకంగా వినిపిస్తుంటుంది. పైగా జగన్ లాంటి నాయకుడిని తట్టుకుని నిలబడాలంటే జూనియర్ రాక అనివార్యం అని, ఆలా కానిపక్షంలో 2024 ఎన్నికల అనంతరం పార్టీ మనుగడ ప్రశ్నార్ధకం అయిపోద్దని వారు చెబుతుంటారని అంటుంటారు.

పవన్ కల్యాణ్ నో.. లోకేష్ నో నమ్ముకుని టీడీపీ భవిష్యత్తుని గాల్లో దీపాన్ని చేయడం సరైన చర్య కాదనేది వారి అభిప్రాయంగా ఉందని అంటుంటారు. అయితే టీడీపీని ఏనాడో పూర్తిగా తన కంట్రోల్ లో పెట్టుకున్న చంద్రబాబు… ఆ పార్టీని లోకేష్ కు వారసత్వ ఆస్తిగా ఇవ్వాలనుకుంటున్నారని ఒక వర్గం ఆరోపిస్తుంటుంది. దీంతో… టీడీపీ భవిష్యత్తుని, నందమూరి వంశం చేతిలోనే ఆ పార్టీ ఉండాలని నమ్మేవారు మాత్రం అవకాశం ఉన్న ప్రతిసారీ “జై ఎన్టీఆర్” అనే అంశాన్ని తెరపైకి తెస్తుంటారు.

అయితే అది గుంటూరు, విజయవాడ, గుడివాడకు మాత్రమే పరిమితం కాలేదని తెలుస్తుంది. అవును.. తాజాగా అమెరికాలోని “తానా” సభల్లో టీడీపీ ఎన్నారై తెలుగు తమ్ముళ్లు కొట్టుకున్నారంటూ వైఎస్సార్సీపీ ఆరోపించింది. ఈ మేరకు ఆ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ లో ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో భాగంగా… ఆ మీటింగ్ లో కొందరు తెలుగు తమ్ముళ్లు జై ఎన్టీఆర్ అంటూ నినాదం చేశారని, దీంతో ఆగ్రహించిన లోకేశ్ అభిమానులు వారిపై దాడికి దిగారంటూ పేర్కొంది.

ఎప్పటినుంచో నందమూరి అభిమానులు, నారా కార్యకర్తలుగా విడిపోయిన తెలుగు తమ్ముళ్లు… ఈ జాడ్జాన్ని అమెరికాకు కూడా తీసుకువెళ్లారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో… తాజాగా తానా సభల్లో కూడా తన్నుకోవడం గమనార్హం. మరి ఈ విషయాలపై తానా కానీ, టీడీపీ ఎన్నారై విభాగంగాని ఎలా స్పందించబోతోందనేది వేచి చూడాలి.