సుజనా చేతనే  టిడిపికి ఘోరీ కట్టించేస్తున్నారు

చంద్రబాబానాయుడుకు అనుంగు అనుచరుడు, బినామీగా ప్రచారంలో ఉన్న మాజీ టిడిపి నేత సుజనా చౌదరే తెలుగుదేశంపార్టీకి ఘోరీ కడతారా అన్న అనుమానం పెరిగిపోతోంది. గుంటూరులో జరిగిన ఆత్మీయ సదస్సులో సుజనాకు బిజెపి భారీ సన్మానమే చేసింది. ఆ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు చేసింది ఆధర్మపోరాటంగా అభివర్ణించారు.

ఎన్డీఏలో నుండి వచ్చేసిన తర్వాత నరేంద్రమోడికి వ్యతిరేకంగా చంద్రబాబు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి ధర్మపోరాటం పేరుతో ఓ ప్రహసనం నడిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ విషయంపైనే సుజనా మాట్లాడుతూ అప్పట్లో చంద్రబాబు చేసిన పోరాటం అధర్మపోరాటంగా అభివర్ణించారు.

ఎన్డీఏలో నుండి బయటకు వెళ్ళటం తప్పుడు నిర్ణయమని తాను టిడిపిలో ఉన్నపుడు చెప్పినా చంద్రబాబు వినలేదన్నారు.  ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసి చంద్రబాబు తప్పు చేశారని చెప్పారు. సరే ఇవన్నీ మామూలు విషయాలే అయినా వైసిపికి ప్రత్యామ్నాయం బిజెపి మాత్రమే అన్నారు. అందులో భాగంగానే సుజనా టిడిపి నేతలను బిజెపిలో లాగే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

టిడిపి ఎంఎల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తో పాటు గుంటూరు జిల్లాలోని కొందరు నేతలను సుజనా బిజెపిలోకి లాగేశారు. ఇంకా కొందరిపై టార్గెట్ పెట్టారు. అంటే సుజనా చేతితోనే చంద్రబాబు కళ్ళు పొడిపించాలని బిజెపి పెద్ద ప్లానే వేసినట్లు అర్ధమవుతోంది. ఇష్టం ఉన్నా లేకపోయినా  సుజనా కూడా అందులో పాత్ర పోషించక తప్పదంతే.