Simhachalam Wall Collapse: సింహాచలం గోడకూలిన విషాదం: బాధిత కుటుంబాలకు పరిహారం

విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరిగిన గోడ కూలిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చందనోత్సవం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ మరిగిపోగా, టికెట్ క్యూలైన్ వద్ద ఉన్న సిమెంట్ గోడ అకస్మాత్తుగా కూలిపోవడంతో ఎనిమిది మంది భక్తులు మృతిచెందారు. పలువురు గాయపడటంతో వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. అలాగే, దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో బాధిత కుటుంబ సభ్యులకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా గోడ బలహీనమై కూలిన అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్ కౌంటర్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ పక్కన ఉన్న గోడ కూలిపోవడంతో భక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఫైర్‌, రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, పోలీస్ ఉన్నతాధికారి శంఖబ్రత బాగ్చీ ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల దేహాలను కేజీహెచ్‌కి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. గాయపడిన భక్తులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ నేతలు నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు వేస్తుండగా, హోంమంత్రి అనిత గోడ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నిర్మించబడలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కమిటీ వేస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

పుస్తెలతాడుకి పరీక్ష..? || Students Made To Remove 'Janeu' At CET Exam Centre || Telugu Rajyam