పెళ్లైన సంవత్సరంన్నరకే అనుమానాస్పదపు మృతి, వేములవాడ రవళిది హత్యా లేక ఆత్మహత్య?

వారిద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఎదురి తిరిగి పెళ్లి చేసుకున్నారు. వేరుకాపురం కూడా పెట్టారు. చూస్తుండగానే సంవత్సరంన్నర కాలం కరిగిపోయింది. కానీ ఇంతలోనే ఏమైందో ఏమో ఆ యువతి అనుమానాస్పదపు స్థితిలో చనిపోయింది. అసలు వివరాలు ఏంటంటే…

వేములవాడ మండలం వట్టెంల గ్రామానికి చెందిన ఎడ్ల రవళి అదే గ్రామానికి చెందిన ఎదురుగట్ల శ్రవణ్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇంట్లో పెద్దలకు కూడా తెలిసింది. అయితే వారి కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వారు పెద్దలకు తెలియకుండా సంవత్సరంన్నర కింద రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత సిరిసిల్లలోని గాంధీ నగర్ లో ఓ రూం కిరాయి తీసుకొని కాపురం పెట్టారు. శ్రవణ్ లోకల్ గానే పని చేస్తుండగా రవళి ఇంట్లోనే ఉంటూ చదువుకునేది. వీరి కాపురం సజావుగా సాగుతున్న సమయంలో శ్రావణ్ కుటుంబం వీరికి దగ్గరైంది. 

 ఆ తర్వాత రోజు రోజుకు కుటుంబ పరిస్థితి గడవడం కష్టంగా మారడంతో శ్రావణ్ ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది. కట్నం తేవాలని రవళిని శ్రావణ్ మరియు అత్త వేధించేవారు. ఇంటికి వెళ్లలేక కట్టుకున్నవాడితో మంచిగా ఉండలేక రవళి మానసిక క్షోభకు గురైంది.  సోమవారం రాత్రి రవళి ఇంట్లో ఉరి వేసుకొని కనిపించింది. అయితే రవళి మృతి పై అనుమానాలున్నాయి. రవళి ఆత్మహత్యకు పాల్పడిందా లేక రవళిని కట్నం కోసం చంపేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. రవళిని హత్య చేశారని రవళి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రవళి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.