తెలుగు రాష్ట్రాలలో సినిమా పరిశ్రమ, రాజకీయాలలో నందమూరి వారి ప్రస్థానం, స్థానం గురించి తెలియని వారు ఉండరు. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఆయన తదనంతరం అల్లుడు నారా చంద్రబాబు నాయుడు నడిపించారు. కానీ రామారావు గారి కూతురు పురంధేశ్వరి మాత్రం భర్త అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ పార్టీలోకి చేరటం జరిగింది. ఏ పార్టీలో ఉన్నప్పటికీ నందమూరి అభిమానులు పురంధేశ్వరిని రామారావు గారి అమ్మాయిగానే అభిమానిస్తారు. ఆ ఆదరణ బేరీజువేసుకుని రాజకీయ పార్టీలు కూడా ఆవిడకి సముచిత స్థానం కట్టబెడుతుంటాయి.
పురంధేశ్వరి ఆరేళ్ళ క్రితం బీజేపీలో చేరినప్పుడు ఆమెని జాతీయ మహిళా మోర్చాలో కీలక నేతగా తీసుకోవటం జరిగింది. తాజాగా బీజేపీలో పురంధేశ్వరికి మరింత ప్రాధాన్యత పెరిగిపోయింది. దీంతో ఆమె అభిమానులు సంబరపడుతున్నారు. ఈ మధ్యన జాతీయ స్థాయిలో పార్టీలో జరిగిన మార్పులలో చిన్నమ్మకు ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి లభించింది. దాంతో ఏపీ బీజేపీలో ఆమె హవా ఒక్కసారిగా పెరిగింది అంటున్నారు.
విశాఖపట్నంలో తాజాగా బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. విశాఖలోని పురంధేశ్వరి నివాసం దానికి వేదిక కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖలోని ఆమె ఇంట్లోనే పార్టీకి చెందిన పెద్దలంతా భేటీ అయి రాష్ట్ర బీజేపీ ఫ్యూచర్ గురించి సీరియస్ గా చర్చించారు అంటే అది ఆమెకు ఇచ్చిన గౌరవంగానే భావించాలి అంటున్నారు.రానున్న రోజుల్లో ఉత్తరాంధ్రా మీద ఫోకస్ పెడుతున్న బీజేపీ అదే స్థాయిలో ఎన్టీయార్ లెగసీని కూడా తమ వైపు తిప్పుకోవాలని ఆరాటపడుతోంది. దాంతో అనూహ్యంగా పురంధేశ్వరికి పార్టీలో పెద్ద పీట వేస్తున్నారు అంటున్నారు.