యువకుడి దాడిలో గాయపడ్డ పూజారి మృతి

యువకుడి దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన వరంగల్ పోచమ్మ మైదానం శివసాయి మందిరం పూజారి సత్యనారాయణ అంత్యక్రియలు ముగిశాయి. పూజారి స్వగ్రామం మొగిలిచర్లకు చేరుకున్న శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద సత్యనారాయణ అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరిపూర్ణానంద పరామర్శించారు.

వరంగల్ అర్బన్ జిల్లా మొగిలిచర్లకు చెందిన సత్యనారాయణ పోచమ్మ మైదానం సాయి బాబా గుడిలో పనిచేస్తూ అక్కడే ఉండేవాడు. ఇతనికి భార్య పిల్లలు లేరు. అక్టోబర్‌ 26న ఓ యువకుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఉదయం 5.30 గంటలకు ఆలయంలో భక్తిగీతాలను మైక్‌లో ప్రసారం చేస్తూ సాయిబాబాకు హారతిస్తున్న అర్చకుడితో ఎల్‌బీనగర్‌(వరంగల్‌) ప్రాంతానికి చెందిన సయ్యద్‌ సాధిక్‌ హుసేన్‌ మైక్‌ను ఆపాలంటూ గొడవ పడి భౌతికదాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన పూజారిని స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం సత్యనారాయణ మరణించారు.

సత్యనారాయణ మరణంతో ఆగ్రహించిన హిందూ సంఘాలు వరంగల్ బంద్ కు పిలుపునిచ్చాయి. స్వామి పరిపూర్ణానంద అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వస్తే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వామి బస్సులో చేరుకొని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.