సంచలన… ‘బీజేపీలోకి రాఘవ్ చడ్ఢా జంప్’ కి కారణం ప్రియాంక చోప్రా!

రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పడం ఆల్ మోస్ట్ అసాధ్యం అని అంటారు. ఎందుకంటే ఇక్కడ శాస్వత శత్రువులూ, శాస్వత మిత్రులూ అంటూ ఎవరూ ఉండరు.. ఇక్కడ కేవలం అవసరాలు, అవకాశాలూ మాత్రమే ఉంటాయని.. వాటిని సరైన సమయంలో సరైన విధంగా గుర్తించి అందిపుచ్చుకోవడమే రాజకీయమని చెబుతుంటారు.

ఇటీవల దేశరాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఆమ్‌ ఆద్మీ పార్టీ కి రాఘవ్ చడ్ఢా రాజీనామా చేశారు. అనంతరం… ఆయన ఇంతకాలం పార్లమెంట్ సాక్షిగా ఎవరితో అయితే బలంగా పోరాడారో, ఎవరిపై అయితే తీవ్ర విమర్శలు చేశారో.. ఫైనల్ గా ఆ పార్టీలోనే చేరనున్నట్లు చెప్పారు. దీంతో.. ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది.

మొన్నటివరకు ఆమ్ ఆద్మీ పార్టీలో సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీగా ఉన్న రాఘవ్ చడ్ఢా… పార్లమెంట్ లో మాట్లాడే ప్రతి మాటకు యూత్ ఫిదా అయ్యేవారు. ముఖ్యంగా గిగ్ వర్కర్ల ఇబ్బందులు, విమానాశ్రయాల్లో తినుబండారాల అధిక ధరలు, యువతకు సంబంధించిన అంశాలపై ఆయన గొంతు బలంగా వినిపించేవారు. ఒకరోజు డెలివరీ ఏజెంట్‌ గా పనిచేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

దీంతో… ప్రజాస్వామ్య దేవాలయంలో ఆయన పోరాటాలపై ప్రజలకు, ప్రధానంగా యువతకు మంచి నమ్మకం కలిగింది! దీనితోడు ఆయన స్టైలిష్ లుక్, చురుకైన మాటతీరు యువతను బాగా ఆకట్టుకున్నాయి. ఈయన కొత్తతరం రాజకీయాలకు దుక్సూచి వంటి పోస్టులూ సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. మరికొంతమంది మరో అడుగు ముందుకు వేసి.. ప్రధాని అభ్యర్థి అయ్యే అర్హతలు ఈయనకు ఉన్నాయని ప్రచారం చేసిన పరిస్థితి.

కట్ చేస్తే… రాఘవ్ చడ్ఢా బీజేపీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు.. కాషాయ కండువా కప్పుకున్నారు.. స్వీట్లు తినిపించుకున్నారు! దీంతో… యువత సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహాన్ని చూపించింది. ఇందులో భాగంగా.. కేవలం 24 గంటల వ్యవధిలో సుమారు 10 లక్షలకు పైగా నెటిజన్లు ఆయనను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశారు. ఈ విషయం కూడా చర్చనీయాంశంగా మారింది!

ఈ పరిణామాల నేపథ్యంలో రాఘవ్ చడ్ఢా బీజేపీలో చేరడం వెనుక ఆయన వదిన, గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హస్తం ఉందని.. ఈయన కాషాయ కండువా కప్పుకోవడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఆమేనని.. తన చెల్లి పరిణితీ చోప్రా క్షేమం కోరే, ఆమె కుటుంబంలో సమస్యలు రాకూడదనే ఉద్దేశ్యంతోనే ప్రియాంక చోప్రా ఈ మేరకు తన మరిదికి సూచనలు చేశారని చెబుతున్నారు.

అవును… ప్రస్తుతం భారత రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన “బీజేపీలోకి రాఘవ్ చడ్ఢా” వ్యవహారంలో తాజాగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పేరు తెరపైకి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి పిల్లర్ లాంటి రాఘవ్ చడ్ఢా.. అనూహ్యంగా కాషాయ కండువా కప్పుకోవడం, ఇది కాస్తా రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించిన నేపథ్యంలో… దీని వెనుక ప్రియాంక చోప్రా ఉందంటూ మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య, నవజ్యోత్ కౌర్ సిద్ధూ వ్యాఖ్యానించారు!

తాజాగా ఒ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో స్పందించిన నవజ్యోత్ కౌర్ సిద్ధూ.. ఈ వ్యవహారంపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… రాఘవ్ చడ్ఢా తన సోదరి పరిణీతి చోప్రా భర్త కావడంతో ఆయనను కాపాడుకోవడం కోసం ప్రియాంక చోప్రా ఈ నిర్ణయం తీసుకున్నారని.. త్వరలోనే ఆయనపై ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని ప్రియాంకకు ముందే సమాచారం అందిందని.. అందుకే తన చెల్లెలి భవిష్యత్తు కోసం ఆమె రాఘవ్‌ ను బీజేపీ వైపు మళ్లించారని ఆమె పేర్కొన్నారు.

దీంతో… ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఈడీ, సీబీఐ లను కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటుందంటూ విపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఎంతటి అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి అయినా.. కాషాయ కండువా కప్పుకోగానే వారంతా సచ్ఛీలులు అయిపోతున్నారని పార్లమెంటు సాక్షిగా పలువురు పేర్లను ఉదహరిస్తూ విపక్ష సభ్యులు, ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు.

ఈ సమయంలో… రాఘవ్ చడ్ఢాపై బీజేపీ ఈడీ దాడులు చేయించాలని భావిస్తుందని.. దీంతో ఆ దాడుల నుంచి తప్పించుకునేందుకే ఆయన అధికార పార్టీలో చేరిపోయారంటూ కౌర్ చేసిన వ్యాఖ్యలు రెండు విషయాలను తేటతెల్లం చేస్తున్నాయని అంటున్నారు!

తమకు రాజకీయంగా సమస్యగా మారిన వారిపై ప్రభుత్వం ఈడీ, సీబీఐలను ప్రోత్సహిస్తుందని… తమపై ఈడీ దాడులు అనే లీకులు అందగానే, తమ సచ్ఛీలతను నీరుపించుకోకుండా, ధైర్యంగా నిలబడకుండా కొంతమంది నేతలు బీజేపీలోకి వెళ్లిపోతున్నారని… అలా వెళ్లిన అనంతరం వారిపై అధికార పార్టీ ఈడీ, సీబీఐ దాడులను ఆపేస్తుందని తాజాగా స్పష్టమైందని చెబుతున్నారు.

అంటే… ఇక్కడ తప్పు తమ పార్టీ రాజకీయ అవసరాల కోసం ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ఉపయోగించేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వానిదా.. లేక, కేంద్ర దర్యాప్తు సంస్థల పేరు చెప్పగానే కండువాలు మార్చేస్తోన్న నేతలదా..? ఈ సందర్భంగా.. చంద్రబాబు, సుజనా చౌదరి, సీఎం రమేష్ ల విషయాలనూ నెటిజన్లు తెరపైకి తెస్తోండటం గమనార్హం! ఏది ఏమైనా… రాఘవ్ చడ్ఢా వ్యవహారంలో ప్రియాంక చోప్రా పేరు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది!

మరోవైపు… కౌర్ చెప్పిన విషయాలు నిజంగా నిజమైతే, ఇది ఇప్పటివరకూ ప్రపంచానికి తెలియని టాప్ సీక్రెట్ అనేది కన్ఫాం అయితే.. అది కచ్చితంగా అటు బీజేపీకి, ఇటు రాఘవ్ చడ్ఢాకు కూడా పొలిటికల్ గా డ్యామేజ్ కలిగించే విషయమే అవుతుందని అంటున్నారు పరిశీలకులు.

అందుకు కారణం… కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపైకి బీజేపీ ప్రయోగిస్తుందనే విమర్శలు మరింత బలంగా నిజమవ్వడంతోపాటు… ఈడీ పేరు చెప్పగానే వణికిపోయిన రాఘవ్ చడ్ఢా కూడా చాలామంది రాజకీయ నాయకుల మాదిరిగానే “ఆ తానులో ముక్కే” అనే విషయంపై యువతకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది!!