పోసాని, అలీ.! వైసీపీకి వీళ్ళతో లాభమెంత.?

స్థానికంగా వైసీపీ నేతలు కష్టపడుతున్నారు.. అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ‘వైనాట్ 175’ అనే లక్ష్యంతో ముందుకెళుతున్న వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సినీ నటులు అలీ, పోసాని కృష్ణమురళి లాంటోళ్ళతో రాజకీయంగా ప్రయోజనమేంటి.?

పార్టీ కోసం తమవంతుగా కష్టపడ్డారు గనుక.. వారికి ‘కీలక పదవులు’ అనుకుంటే, వాళ్ళ కంటే బాగా కింది స్థాయి నేతలు కష్టపడ్డారు. వాళ్ళేమో తమకు తగినంత గుర్తింపు రావడంలేదు మొర్రో.. అంటూ పార్టీని వీడేందుకు సైతం సిద్ధమవుతున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటోళ్ళను వైసీపీ వదిలేసుకోవాల్సి రావడం ఆశ్చర్యకరమే.

నిజానికి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ‘జగన్ సేన’కి సైనికుడిలా వ్యవహరిస్తూ వచ్చారు నెల్లూరు జిల్లాలో. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కంటే, ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కంటే కూడా కార్యకర్తలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి. ఇదిలా వుంటే, ‘పదవుల కోసం వైసీపీలోకి రాలేదు..’ అంటూ సినీ నటుడు పోసాని కృష్ణమురళి తాజాగా వ్యాఖ్యానించారు. ‘పార్టీ కోసం పని చేస్తాను..’ అన్నారు.

సినిమా సంబంధిత పోస్టు ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోసానికి ఇటీవల వైఎస్ జగన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పోస్టులో పోసాని ఏం చేస్తారన్నది ఆయనకే తెలియదు. కోటంరెడ్డి లాంటోళ్ళ సమస్య కూడా అదే. అలీ కావొచ్చు, పోసాని కావొచ్చు.. వీళ్ళ వల్ల పార్టీకి ఏంటి లాభం.? అనే ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకు వైసీపీ అధినాయకత్వం వద్ద కూడా సమాధానం లేదు. రేప్పొద్దున్న బరిలో అలీ దిగాల్సి వచ్చినా, పోసాని దిగాల్సి వచ్చినా గెలిచేంత సీన్ వుందా.?