Narendra Modi: మోదీ రాకతో అమరావతిలో నూతన ఆశలు

రాష్ట్ర ప్రజల కళ్లల్లో ఎన్నో కలలు నాటిన అమరావతి రాజధాని… ఎట్టకేలకు మళ్లీ ఒకసారి కదలబోతోంది. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి రానుండటంతో ఈ ప్రాంతం చైతన్యంతో ఉప్పొంగిపోతోంది. ఈసారి మోదీ రాక సాదారణం కాదని, రాజధాని పునర్నిర్మాణానికి నూతన దిక్సూచి అవుతుందని వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ మోదీ పర్యటన కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతుండగా, ఈ రాకతో అమరావతి భవిష్యత్తు మరింత స్పష్టతను అందుకునేలా కనిపిస్తోంది.

గతంలోనూ మోదీ అమరావతిలో శంకుస్థాపన చేసినా, భౌతికంగా పెద్దగా పురోగతి కనిపించలేదు. ఆ సమయంలో పవిత్ర నదుల జలంతో, మట్టితో శుభారంభం చేసినప్పటికీ కేంద్రం నుంచి ఆర్థికంగా అనుకున్నంత మద్దతు రాలేదు. కానీ ఈసారి రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. కేంద్రంలో ఎన్డీఏకి మద్దతుగా టీడీపీ కీలక పాత్రలో ఉండటం, రాష్ట్రానికి మరింత ప్రాధాన్యతను తీసుకువచ్చింది.

ఇప్పటికే అమరావతి అభివృద్ధికి అవసరమైన రుణాలకు కేంద్రం హామీ ఇవ్వడం, ప్రధాన రహదారుల అనుసంధానం వంటి అనేక అంశాలకు ఆమోదం తెలపడం చూస్తే… కేంద్రం వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించిన ప్రాజెక్టులకు వెంటనే అంగీకారం లభించడం ద్వారా రాజధాని నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. మౌలిక వసతుల కల్పనలో అమరావతికి ప్రత్యేక స్థానం లభిస్తున్నదనే అభిప్రాయం బలపడుతోంది.

ఇప్పుడు మోదీ రాక సందర్భంగా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించే అవకాశముందన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈ ప్యాకేజీ అమలైతే… రాజధాని నిర్మాణానికి వేగం పెరిగడమే కాక, ఉద్యోగాలు, మౌలిక వసతులు, విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమమవుతుందన్న ఆశలు జనం లో నెలకొన్నాయి. ఇదే జరిగితే అమరావతి ఒక ప్రణాళికాబద్ధమైన రాజధానిగా అభివృద్ధి చెందే అవకాశముంది.

ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనపై ప్రజలలో భారీ ఆసక్తి నెలకొంది. ఈసారి ఏవైనా శుభవార్తలు వస్తాయని, ఒక దశలో ఆగిపోయిన రాజధాని నిర్మాణం మళ్లీ ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. నిజంగా ఈ పర్యటన అమరావతి దిశను మలుపు తిప్పుతుందా? అన్నదే ఇప్పుడు రాష్ట్ర ప్రజల మదిలో తలెత్తుతున్న ప్రశ్న.

కూటమిని వణికిస్తున్న గ్రోక్‌ || Director Geetha Krishna About Grok AI Shocking Truths || Modi || TR