ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి ముందు రోజు కేంద్రం నుంచి సంచలన నిర్ణయం వెలువడింది. పునఃప్రారంభానికి శ్రీకారం చుట్టే శుక్రవారానికి ముందే ప్రధాని నరేంద్ర మోదీ, అమరావతికి భారీ గిఫ్ట్ ఇచ్చారు. కేంద్ర రవాణా శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, అమరావతిని చుట్టేస్తూ నిర్మించబోయే అవుటర్ రింగ్ రోడ్ను ఇప్పుడు మరింత విస్తృతంగా 140 మీటర్ల వెడల్పుతో రూపొందించనున్నారు. ఈ రహదారి నిర్మాణానికి కేంద్రం రూ.35,000 కోట్లు వ్యయం చేయనుంది.
ఇప్పటికే పలు విషయాల్లో అమరావతికి బలమైన మద్దతు ప్రకటించిన మోదీ సర్కారు, ఇప్పుడు ఓఆర్ఆర్ ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 70 మీటర్ల వెడల్పుతో ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చినా, తాజా నిర్ణయంతో నగరాభివృద్ధి మరింత వేగం తాళనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇది సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్ర కీలకం. ఢిల్లీతో వరుస చర్చలు జరిపిన ఆయన, అమరావతిని గ్లోబల్ సిటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఓఆర్ఆర్ను వాస్తవ అవసరాలకనుగుణంగా విస్తరించాలన్న అభిప్రాయాన్ని కేంద్రానికి వివరించారు. రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన పలువురు సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రాధాన్యతగా ప్రస్తావించగా, కేంద్రం సానుకూలంగా స్పందించింది.
ప్రధానమంత్రి మోదీ అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనబోతుండటం, దానికి ముందు ఈ భారీ ప్రాజెక్టును ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. ఈ రహదారి అమరావతిని బలమైన రవాణా కేంద్రంగా మార్చడంతో పాటు, పరిసర ప్రాంతాల అభివృద్ధికి దోహదపడనుందని విశ్లేషకుల అభిప్రాయం. ఈ ప్రాజెక్టు అమలవుతోన్న వేళ, రాజధాని అభివృద్ధిపై కేంద్రం పూర్తి నమ్మకంతో ఉంది అనే సంకేతాన్ని కూడా ఈ నిర్ణయం ఇస్తోంది. త్వరలోనే మిగతా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా కేంద్రం నుంచి బలమైన మద్దతు రానుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.