పబ్బుకు పోయే యూత్‌కు పవన్ కళ్యాణ్ సలహా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువతకు ఓ సలహా ఇచ్చారు. యువత పబ్ లు , రేస్ లలో పాల్గొనడం కాదు భగత్ సింగ్ ప్రాణత్యాగం గురించి తెలుసుకోవాలన్నారు. 23 ఏళ్లలోనే భగత్ సింగ్ దేశం కోసం ప్రాణత్యాగాన్ని చేసిన వీరుడన్నారు. నేటి యువత సమయాన్ని వృథా చేస్తూ తమ జీవితాన్ని తప్పుదోవ పట్టించుకుంటున్నారన్నారు. చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని పవన్ ఆకాంక్షించారు.

భగత్ సింగ్ జీవిత చరిత్ర తనని ప్రభావితుడిని చేసిందన్నారు. చిన్న వయస్సులోనే వందేళ్ల జీవిత కాలంలో చేసే పనులన్నీ చేసి భగత్ సింగ్ ప్రజల గుండెల్లో నిలిచారని పవన్ కొనియాడారు. నేటి యువత పార్టీలు, పబ్బులు అంటూ తిరుగుతూ తమ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారన్నారు. ఇలా అయితే దేశ అభివృద్ది ఎలా సాధ్యం అని పవన్ ప్రశ్నించారు. మీరు పబ్బులకు వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించాలని పవన్ యువతకు సలహానిచ్చారు. భగత్ సింగ్ జీవిత చరిత్రను యువత చదవాలని సూచించారు.