పాదయాత్ర.. అత్యంత ఖరీదైన వ్యవహారం.!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ చేస్తున్న ‘యువగళం’ పాదయాత్రపై సందేహాలు కలుగుతున్నాయి. పాదయాత్ర చివరి వరకు కొనసాగుతుందా.? లేదా.? అన్న అనుమానాలు తెలుగు తమ్ముళ్ళలోనే వ్యక్తమవుతున్న పరిస్థితి. కొన్ని సందర్భాల్లో పట్టుమని పది మంది కూడా నారా లోకేష్ వెంట పాదయాత్రలో కనిపించడంలేదు. టీడీపీ వ్యతిరేక మీడియాలో ఈ మేరకు కథనాలు వస్తున్నాయ్. లోకేష్ వెంట జనం పోటెత్తడమూ నిజమే.. లోకేష్ వెంట జనం లేకపోవడమూ నిజమే.! ఎవరికి కావాల్సింది వారు ప్రచారం చేసుకుంటారంతే.

అయితే, పాదయాత్ర కోసం తెలుగుదేశం పార్టీ అసలు కసరత్తులే చేయలేదా.? చేసిన కసరత్తులు ఫెయిలయ్యాయా.? అన్నదే చర్చ ఇక్కడ. సొంత జిల్లా చిత్తూరులోనే నారా లోకేష్ పాదయాత్ర ఒకింత పేలవంగా జరిగింది.. కొన్ని చోట్ల. మిగతా చోట్ల మాత్రం జనాన్ని బాగానే సమీకరించగలిగారు. రాను రాను జనం పలచబడిపోతుండడంతో, దిద్దుబాటు చర్యలకు టీడీపీ ఉపక్రమించింది.

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ పాదయాత్రపై జరుగుతున్న చర్చల్లో, ప్రతిరోజూ పాదయాత్ర కోసం కోటి రూపాయల దాకా ఖర్చు చేయాల్సి వస్తోందన్న విషయం బయటకు వస్తోంది. నిజంగానే, ఆ స్థాయిలో ఖర్చు చేయాల్సిందేనా.? అంటే, ఏమో.. తప్పదేమో.! వచ్చే కార్యకర్తలు లేదా జనాన్ని బాగా చూసుకోకపోతే, పాదయాత్ర ప్రారంభం నుంచి ముగింపు వరకూ వెంట కనిపించే అవకాశం లేదు గనుక.. అవుతాయ్.. ఖచ్చితంగా అవుతాయ్ ఆ మాత్రం ఖర్చులు.