తెలుగుదేశం పార్టీపై యాదవులు కన్నెర్రజేశారు. మహా కూటమిలో తెలుగుదేశం పార్టీ జట్టు కట్టి యాదవ అభ్యర్థులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. మహా కూటమి రెడ్ల కూటమిగా మారిందని ఓయూ కు చెందిన యాదవ విద్యార్థులు ఫైర్ అయ్యారు. ఈ విషయమై కూటమిలో యాదవులకు సీట్లు కోత విధించడాన్ని నిరసిస్తూ టిడిపి ఆఫీసు ముందు అర్ధ నగ్న ప్రదర్శన చేశారు ఓయూ స్టూడెంట్స్. ఒక విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తెలంగాణలో టిఆర్ఎస్ ను ఓడించే ఉద్దేశంతో చిరకాల ప్రత్యర్థులైన కాంగ్రెస్, టిడిపి, సిిిపిఐ పార్టీలతో పాటు తెలంగాణ జన సమితి జట్టు కట్టాయి. కానీ మహా కూటమిలో బిసిలకు మొండి చేయి చూపారన్న విమర్శలు బలంగా వినబడుతున్నాయి. ముఖ్యంగా యాదవ సామాజికవర్గానికి తీరని అన్యాయం జరిగిందని యాదవ ప్రముఖులు ఆందోళన చెందుతున్నారు. మహా కూటమిలో ప్రత్యేకించి యాదవ సీట్లను అగ్రవర్ణాలకు కట్టబెట్టడం వివాదం రగిలించింది.
ఒకవైపు టిఆర్ఎస్ పార్టీ అంతో ఇంతో యాదవులకు సీట్ల కేటాయింపులో ప్రాముఖ్యతనిచ్చింది. 5 సీట్లను యాదవ (కుర్మ, గొల్ల కలిపి) సామాజిక వర్గానికి ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జైపాల్ యాదవ్, సతీష్ కుమార్, నోముల నర్సింహ్మయ్య, అంజయ్య యాదవ్ లకు టిఆర్ఎస్ సీట్లు ఇచ్చింది. కానీ కూటమి యాదవులకు ఇచ్చిన సీట్ల సంఖ్య కేవలం ఒకటి మాత్రమే. అది కూడా హైదరాబాద్ లో అనీల్ కుమార్ యాదవ్ కు ఇచ్చారు.
తెలంగాణలో బలమైన సామాజికవర్గాల్లో యాదవులు కూడా ఉన్నారు. మరి అలాంటి వారికి సీట్లు కేటాయించకుండా కూటమికి ఓట్లు గుద్దండి అంటే బిసిలు కానీ, యాదవులు కానీ ఎలా వేస్తారంటూ యాదవ విద్యార్థులు నిలదీస్తున్నారు. దీంతో ఓయూ కు చెందిన యాదవ విద్యార్థులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను ముట్టడించారు. కూటమిలో యాదవ సీట్లకు కోత విధించడం సరికాదని నినదించారు.
శేర్ లింగంపల్లి లో భిక్షపతి యాదవ్ కు సీటు ఇవ్వాలని, కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్ కు, సికింద్రాబాద్, ఆలేరులో యాదవ అభ్యర్థులకు కూటమిలో అవకాశం కల్పించకపోతే కూటమి అభ్యర్థులెవరికీ యాదవ జాతి బిడ్డలు ఓట్లు వేసే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బిసిలకు ఉన్నత స్థానం కల్పించిన ఎన్టీఆర్ ఆశయాలకు కూటమి వెన్నుపోటు పొడుస్తోందని మండిపడ్డారు. మహా కూటమి పేరుతో తెలంగాణలో రెడ్లను అధికారంలోకి తెచ్చేందుకు టిడిపి తాపత్రయ పడడం దుర్మార్గమన్నారు.
ఈ పరిణామాలు రేపటి ఆంధ్రా ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతాయని బిసి పార్టీగా ఉన్న టిడిపికి ఆంధ్రాలో యాదవులు దూరమవుతారని హెచ్చరించారు. టిఆర్ఎస్ కు ఉన్న సోయి కూడా టిడిపికి లేకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ రెడ్డి పార్టీగా ఉంటే టిడిపి ఎందుకు ఆ పార్టీకి తానా అంటే తందానా అంటుందో చెప్పాలని నిలదీశారు. ఆందోళన చేస్తున్న యాదవ విద్యార్థులను పోలీసులు జోక్యం చేసుకుని అక్కడి నుంచి పంపించేశారు. యాదవ స్టూడెంట్స్ ఆందోళన వీడియోలు పైన ఉన్నాయి చూడండి.