Chandrababu : వైఎస్ జగన్‌కి ఆ ఛాన్సిచ్చి తప్పు చేశావ్ చంద్రబాబూ.!

Chandrababu : ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని గ్రాఫిక్స్‌లో కాకుండా, నిజంగానే రూపొందించి వుంటే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని అని వుండేవారు కాదేమో. చంద్రబాబు హయాంలోనే పేదల ఇళ్ళకు సంబంధించిన బకాయిల సమస్య తీర్చి వుంటే, ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ఓటీఎస్’ అనేవారు కాదేమో.!

ఒకటా.? రెండా.? చాలా వున్నాయ్. చంద్రబాబు తన ఐదేళ్ళ పాలనలో చెయ్యాల్సినవేవీ చేయలేదు. నిజానికి, ఎవరు అధికారంలో వున్నా, ఐదేళ్ళలోనో, పదేళ్ళలోనో అన్నీ చేసెయ్యలేరు. కానీ, చంద్రబాబు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తొమ్మిదేళ్ళు, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

సో, రాష్ట్రంలో పేదరికమంటూ లేకుండా చంద్రబాబు చేయగిలిగి వుంటే, నవరత్నాల అవసరం వచ్చి వుండేదా.? ఇది చంద్రబాబుకే పరిమితమైన ప్రశ్న కాదు. టీడీపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో ఈ ప్రశ్నలు వస్తాయ్, వచ్చి తీరతాయ్.

‘మేం అధికారంలోకి వస్తే, ఓటీఎస్ ఉచితంగా చేస్తాం..’ అని టీడీపీ అంటోంది. టీడీపీకి ఆ చిత్తశుద్ధి వుండి వుంటే, ఇప్పుడు వైఎస్ జగన్ సర్కార్, ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ అని వుండేదే కాదు. అధికారంలోకి వస్తే చేసేస్తామంటారు, అధికారమిస్తే ఏమీ చెయ్యరు. అదే రాజకీయ నాయకుల లక్షణం.

కాగా, ఓటీఎస్ విషయంలో వైఎస్ జగన్ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందనీ, హౌసింగ్ కార్పొరేషన్‌కి ప్రభుత్వం 10 వేల కోట్లు ముందుగా ఇవ్వాలనీ, ఆ తర్వాత ఓటీఎస్ గురించి మాట్లాడాలని టీడీపీ నేత పట్టాభి అంటున్నారు. ఇది కూడా లాజికల్‌గా ఆలోచిస్తే, కీలకమైన అంశమే సుమీ.