నారా లోకేష్ పాదయాత్ర.! అట్టర్ ఫ్లాప్ అయినట్లే.!

ఔనా.? నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారా.? టీడీపీ అనుకూల మీడియాలోనే ఎక్కడా ఈ పాదయాత్ర గురించి పెద్దగా ప్రస్తావన కనిపించడంలేదు. వారం తిరగకుండానే పాదయాత్ర ఎందుకిలా తేలిపోయింది.? పట్టుని పాతిక మందిని కూడా నారా లోకేష్ తన వెంట పాదయాత్రలో తిప్పుకోలేకపోతున్నారనీ, లోకేష్ చుట్టూ పాదయాత్రలో కనిపిస్తున్నవాళ్ళంతా సెక్యూరిటీ సిబ్బందేననీ సోషల్ మీడియాలో పొటోలతో సహా ఆధారాలు కనిపిస్తున్నాయి.

‘యువగళం’ పేరుతో కుప్పం నియోజకవర్గం నుంచి సుదీర్ఘ పాదయాత్రకు నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. 400 రోజులపాటు నాలుగు వేల కిలోమీటర్ల మేర రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాదయాత్ర జరగాల్సి వుంది. కానీ, పాదయాత్ర ప్రారంభించిన మూడో రోజే.. ఆ పాదయాత్రలో జనం పలచబడిపోయేసరికి ఏం చేయాలో అర్థం కావడంలేదు.

అసలంటూ లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన రోజే, ఆ పాదయాత్రలో పాల్గొన్న సినీ నటుడు నందమూరి తారక రత్న తీవ్ర అస్వస్థతకు గురై, గుండెపోటుతో కుప్పకూలడం.. ఆయన్ని బెంగళూరుకి తరలించడంతో.. నందమూరి అభిమానుల్లో భయాలు మొదలయ్యాయి.

దాంతో, సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు నారా లోకేష్ పాదయాత్రను అస్సలు పట్టించుకోవడం మానేశారు. కనీసం ఒకటి రెండ్రోజులు పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి, తారకరత్న విషయంలో కొంత హడావిడి చేసి వుంటే అది నారా లోకేష్‌కి అడ్వాంటేజ్ అయ్యేది నందమూరి అభిమానుల్లో.

ఇప్పుడున్న పరిస్థితి చూస్తోంటే, ఏదో ఒక సాకు చూపించి, నారా లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించేలా వుంది టీడీపీ అధిష్టానం. అన్నట్టు, లోకేష్ పాదయాత్రకు జనం తక్కువగా వస్తుండడంపై టీడీపీ అధినేత చంద్రబాబు గుస్సా అవుతున్నారట. స్థానిక నాయకత్వం జన సమీకరణలో విఫలమవుతోందని చంద్రబాబు ఆయా నేతలపై మండిపడుతున్నట్లు తెలుస్తోంది.