ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలకు సమాధానంగా మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. తిరుపతిలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన లోకేష్, రెడ్బుక్ అంశంపై క్లారిటీ ఇచ్చారు. తన పాదయాత్రలో రాసుకున్న పేర్లను వదిలేది లేదని, ప్రతి ఒక్కరికి న్యాయం జరగేలా చూస్తానని తెలిపారు.
వైసీపీ హయాంలో అన్యాయంగా కేసులు పెట్టినవారు, జైలుకు వెళ్లిన వారు ఎదుర్కొన్న బాధలు తనకు తెలుసని లోకేష్ స్పష్టంచేశారు. ఈ విషయంలో రెడ్బుక్ పూర్తిగా పని చేస్తుందని, అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని నాయకులకు ధీమా ఇచ్చారు. జగన్ వ్యాఖ్యలను పక్కన పెట్టి, కార్యకర్తలు పార్టీ కోసం పని చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఇకపై టీడీపీ తరఫున అనేక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని లోకేష్ ప్రకటించారు. మహానాడు వేదికగా పార్టీ భవిష్యత్తు కార్యాలయాలు, కార్యక్రమాలపై స్పష్టత ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆ ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత నాయకులు, కార్యకర్తలదేనని గుర్తుచేశారు. ఈసారి కష్టపడ్డవారికే పదవులు దక్కుతాయని, తన చుట్టూ తిరిగేవారికి కాదు అని వార్నింగ్ ఇచ్చారు.
తానూ ప్రజల్లో ఉండి పాదయాత్ర చేసినందుకే మంత్రి పదవి దక్కిందని లోకేష్ గుర్తు చేశారు. అదే తరహాలో నాయకులు కూడా ప్రజల్లో ఉండాలి, కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనాలి, అప్పుడు మాత్రమే గుర్తింపు వస్తుందని అన్నారు. చివరగా, పార్టీలో క్రమశిక్షణ, పరస్పర సహకారం అనేవి కీలకమని లోకేష్ స్పష్టం చేశారు.