లోకేష్ మరిచిన లక్ష్యం… బూడిదలో పోసిన పన్నిరే కష్టం!

అందరూ పాదయాత్ర చేస్తున్నారు కదా అని తానూ మొదలుపెట్టారో.. లేక, గతంలో పాదయాత్ర చేసిన వారు ముఖ్యమంత్రులు అయ్యారనే నమ్మకంతో బయలుదేరారో.. అదీగాక, తనను తాను ఫ్యూచర్ హోప్ గా ప్రొవోక్ చేసుకోవాలనుకున్నారో తెలియదు కానీ… యువగళం అంటూ నడకందుకున్నారు లోకేష్! ఈ క్రమంలో ఆయన లక్ష్యం మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

అవును… లోకేష్ లక్ష్యం పూర్తిగా మారిందని అంటున్నారు విశ్లేషకులు. సినిమాల్లో మాస్ డైలాగులకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టినట్లుగా… ఆ చప్పట్లకు బాగా అలవాటుపడిపోయారో ఏమో కానీ… కేవలం డైలాగులకే పరిమితం అయిపోతున్నారు. బెదిరింపులకు దిగడంతోపాటు.. టీడీపీ అధికారంలోకి వస్తే రివేంజ్ ఉంటుందని.. దానికి అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి అనే తారతమ్యాలు లేవని చెబుతున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే ఎర్ర పుస్తకం చేతబట్టి తిరుగుతున్న లోకేష్.. ఆ బుక్ లో అధికారుల పేర్లు రాసుకుంటున్నామని, పోలీస్ అధికారుల పేరు నోట్ చేసుకుంటున్నామని… తాము అధికారంలోకి వస్తే ఆ అధికారుల సంగతి చూస్తాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ అదేపనికి పూనుకున్నారు. ఇందులో భాగంగా గుడివాడ ఎమ్మెల్యేపై అవాకులూ చెవాకులూ పేలారు!

“కొడాలి నానిని నడిరోడ్డుపై కట్ డ్రాయర్ మీద పరిగెత్తిస్తా.! ఒక్కొక్కరి చేత @#$% పోయించే బాధ్యత నాది” ఇవి టీడీపీ యువకిశోరం నారా లోకేష్ గన్నవరం యువగళం సభలో పేల్చిన పంచ్ డైలాగులు. దీంతో అసలు కొడాలి నానీకి చినబాబు చుక్కలు చూపించారని తమ్ముళ్లు అంటుంటే… దాన్నే పొలిటికల్ ప్రవచనాలుగా టీడీపీ అనుకూల మీడియా హైలైట్ చేస్తోంది.

దీంతో… జగన్ పాదయాత్రలో పోల్చి చూస్తే లోకేష్ పాదయాత్ర వల్ల ఆయన పడుతున్న కష్టం బూడిదలో పోసిన పన్నిరే అని అంటున్నారు పరిశీలకులు. అప్పటి ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్రకు ఇప్పుడు భావి టీడీపీ ఆశాకిరణంగా లోకేష్ చేస్తున్న యాత్రకు మధ్య చాలా తేడా ఉందని చెబుతున్నారు.

నాడు జగన్… ఊరూవాడా ప్రజల సమస్యలు తెలుసుకోడానికే పాదయాత్ర చేశారు. యాత్రలో ఆయన నాయకుల్ని తక్కువ, సామాన్య ప్రజల్ని ఎక్కువగా కలిశారు. సభల్లో టీడీపీపై విమర్శలు చేసినా.. వాటికి తక్కువ సమయం కేటాయించి, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది వివరించడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఫలితం తెలిసిందే!!

కానీ చినబాబు మాత్రం తాము అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన అందిస్తాం.. గతంలో తన తండ్రి అందించిన పాలన లాంటి పాలన అందిస్తాం వంటి మాటలు మానేసి… కేవలం రివేంజ్ తీర్చుకుంటామంటూ ముందుకు సాగుతున్నారు. దీనివల్ల ప్రజానికానికి ఏమి ఉపయోగం అనే ఇంగితం చినబాబు మిస్సవుతున్నారు.

రాను రాను విమర్శలు, పంచ్ డైలాగులు, పవర్ ఫుల్ స్పీచ్ ల వైపు లోకేష్ ఆకర్షితులవుతున్నారు. అలాంటి వాటికే చప్పట్లు వినపడుతుండే సరికి లోకేష్ కూడా ఆ సౌండ్ కే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో జనం సమస్యలపై పెట్టాల్సిన దృష్టి కాస్త… చిన్న చితకా లీడర్ల చేరికలపై పెడుతున్నారు. వాటిపైనే పూర్తి దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తున్నారు.

ఏది ఏమైనా… సుమారు 191 రోజులు పూర్తి చేసుకున్న చినబాబు యువగళం పాదయాత్ర వల్ల పార్టీకి ఒరిగిందేమీ లేదని… లోకేష్ కష్టం కాస్త బూడదలో పోసిన పన్నీరే అయ్యిందని అంటున్నారు పరిశీలకులు.

#@AkBigNews కట్ డ్రాయర్ పై ఊరేగిస్తా : నారా లోకేశ్