అర్థ సెంచరీ బాదేసిన చంద్రబాబు.! సెంచరీ దిశగా.!

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టయి నేటికి 50 రోజులు పూర్తయ్యింది. చంద్రబాబు అభిమానులు హైద్రాబాద్‌లో ఈ అర్థ సెంచరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినీ రంగంలో అర్థ శతదినోత్సవాలు జరుగుతాయ్ కదా.. అలా, సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి హైద్రాబాద్‌లో.

గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం కల్చరల్ యాక్టివిటీస్‌తో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయట. చంద్రబాబుకి సంఘీభావం.. అని అంటున్నారుగానీ, ఈ కల్చరల్ యాక్టివిటీస్ గోలేంటి.? పైగా, దీన్ని ఓ ఈవెంట్‌గా పేర్కొంటూ, ఆహ్వానాలు పంపుతున్నారు నిర్వాహకులు.

నాణేనికి ఓ వైపు ఇది.! ఇంకో వైపు, జైలు నుంచి బయటకు వచ్చేందుకు చంద్రబాబు న్యాయపరంగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, వాయిదాలు.. అలాగే నాట్ బిఫోర్ మీ వ్యవహారాలతో చంద్రబాబుకి ప్రతిసారీ చుక్కెదురవుతోంది న్యాయస్థానాల్లో.

రాజమండ్రి కేంద్ర కారాగారంలో చంద్రబాబు, ప్రాణ భయంతో కొట్టుమిట్టాడుతున్నారు. తన హత్యకు కుట్ర నడుస్తోందని చంద్రబాబు నేరుగా న్యాయస్థానానికి లేఖ రాయడం గమనార్హం. అయితే, చంద్రబాబుకి పటిష్టమైన భద్రత కల్పించామని జైలు అధికారులు అంటున్నారు.

‘నాకు ప్రాణ భయం లేదు. నేనెవరికీ భయపడను..’ అని వేదికలెక్కి ప్రసంగాలు చేసే చంద్రబాబు, ఇప్పుడు యాభై రోజులుగా జైలుకే పరిమితమైపోయి, ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటుండడం ఆశ్చర్యకరమే.

అర్థ సెంచరీ పూర్తయ్యింది.. సెంచరీ దిశగా చంద్రబాబు జైలు వ్యవహారం నడుస్తోందని అనుకోవాలా.? అంతేనేమో.!