కుప్పం నుంచి ఎన్నికల బరిలోకి నారా భువనేశ్వరి.?

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, 2024 ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు అసాధ్యమేనట.! నిజానికి, పోటీ చేయకూడదన్న నిర్ణయాన్ని చంద్రబాబు గతంలోనే తీసుకున్నారంటూ ఓ గాసిప్ బయటకు వచ్చింది. అరెస్టు వ్యవహారం ఆయనకు అనూహ్యంగా కలిసొచ్చిందట.

ఎటూ అరెస్టయి, చంద్రబాబు జైల్లో వున్నారు గనుక.. నారా భువనేశ్వరి దాదాపుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేసినట్లే.! నిజం గెలవాలంటూ భువనేశ్వరి జనంలోకి వెళ్ళడం వెనుక పెద్ద వ్యూహమే వుంది. చంద్రబాబు సతీమణి కంటతడి పెడుతున్నారన్న చర్చ, గ్రామస్థాయి వరకు వెళ్ళిపోయింది.

‘ఇదేం పద్ధతి.?’ అన్న ప్రశ్న జనంలో వైఎస్ జగన్‌కి వ్యతిరేకంగా షురూ అయ్యింది. గతంలో, వైఎస్ జగన్ మీద కూడా ఇదే తరహా ‘అరెస్టు సింపతీ’ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. అదే ఫార్ములాని ఇప్పుడు టీడీపీ వాడుతోందంతే.!

కుప్పంలో ఎటూ చంద్రబాబుని ఓడించడానికి వైసీపీ తమదైన వ్యూహాల్ని రచించింది. కానీ, కుప్పంలో తాను పోటీ చేయకుండా తన సతీమణి భువనేశ్వరిని దించాలనే నిర్ణయాన్ని చంద్రబాబు అమలు చేస్తే, ఆ తర్వాత ఈక్వేషన్స్ అనూహ్యంగా మారిపోతాయ్.

జైల్లో వున్న చంద్రబాబు అనారోగ్యం బారిన పడ్డారంటూ టీడీపీ అను‘కుల’ మీడియా చేస్తున్న ప్రచారమూ వ్యూహాత్మకమే. ఆ అనారోగ్యమే సాకుగా చూపి, జైలు నుంచి విడుదలయ్యాక కూడా చంద్రబాబు, ఎన్నికల ప్రచారానికి దూరంగా వుండే అవకాశం లేకపోలేదట.!

పరిస్థితులు అనుకూలిస్తే, చంద్రబాబు, నారా లోకేష్ సహా, బ్రాహ్మణి కూడా పోటీలో వుంటారనీ, అనుకూలించని పక్షంలో చంద్రబాబు పక్కకి తప్పుకుంటారనీ ప్రచారం జరుగుతోంది.