సెప్టెంబర్ లోనే చెక్కులు రెడీ… మరణిస్తారని ముందే తెలుసా?

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు సెప్టెంబర్ 9న నంద్యాలలో అరెస్టైన సంగతి తెలిసిందే. అనంతరం 10వ రోజున ఏసీబీ న్యాయస్థానం ముందు హాజరుపరచగా… చంద్రబాబుకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పటినుంచీ చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాకులో ప్రత్యేక సదుపాయాలు, సౌకర్యాల మద్య ఉంటున్నారు.

ఆ సంగతి అలా ఉంచితే… చంద్రబాబు సెప్టెంబర్ 9న అరెస్టైన వార్తలు చూసి కొంతమంది గుండే ఆగి మరణించారని, ఆ విషయాన్ని చూసి తట్టుకోలేక వారి గుండేలు ఆగిపోయాయని టీడీపీ నేతలు తెలిపారు. వారందరినీ పరామర్శిస్తానని బాలయ్య ప్రకటించారు. కట్ చేస్తే… న్యాయం గెలవాలంటూ ఆ ఓదార్పు యాత్రను భువనేశ్వరి బుధవారం నుంచి పరామర్శ యాత్ర చేపట్టారు.

ఇందులో భాగంగా… చంద్రగిరిలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఆవులపల్లి ప్రవీ­ణ్‌ రెడ్డి(33) కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అనంతరం పాకాల మండలం నేండ్రగుంటకు చెందిన కనుమూరి చిన్నబ్బ నాయుడు(70) కుటుంబాన్ని కూడా భువనేశ్వరి పరామర్శించారు. గత నెల 25న చిన్నబ్బ నాయుడు వృద్ధాప్య సమస్యలతో మృతి చెందారని తెలుస్తుంది!

ఆ కుటుంబాన్ని పరామర్సించిన అనంతరం… భువనేశ్వరి మృతుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. అవును… భువనేశ్వరి “న్యాయం గెలవాలి” అనే తన పరా­మర్శ యాత్రలో ప్రవీణ్‌ రెడ్డి, చిన్నబ్బ నాయుడు కుటుంబా­లకు రూ.3 లక్షల చొప్పు­న చెక్కులు అందించారు. దీంతో ఆ చెక్కుల్లో ఉన్న తేదీ ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.

అవును… మృతుల కుటుంబాలకు భువనేశ్వరి ఇచ్చిన రూ. 3 లక్షల చెక్కులపై చంద్రబాబు గత నెల 4వ తేదీనే సంతకం పెట్టారు. ఇలా చంద్రబాబు జైలుకు వెళ్లక ముందు సంతకం చేసిన చెక్కులను మృతుని కుటుంబాలకు పంపిణీ చేశారు. దీంతో… అక్టోబర్‌ లో మరణించిన వారికి సెప్టెంబర్ లోనే చెక్కులు రెడీ చేశారా అనే చర్చ ఆన్ లైన్ వేదికగా మొదలైంది.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చంద్రబాబు అలా ఖాళీ చెక్కులపై సంతకాలు పెట్టేసి, అవసరం వచ్చినప్పుడు వడుకోమని అన్నారని అనుకుందామన్నా… ఆ చెక్ లపై ఉన్న డేట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దీంతో… అవినీతికేసులో తాను జైలుకు వెళ్తానని చంద్రబాబుకు ముందే తెలుసా.. అలా వెళ్తే ఆయన కోసం కొంతమంది మరణిస్తారని కూడా ముందే గ్రహించారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది!