టిడిపి ఎమ్మెల్యే అనుచరుడి హత్యకు కుట్ర

గుంటూరు జిల్లా గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడి హత్యకు కుట్ర పన్నిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు తపంచాలు, రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరూ గతంలో ఎమ్మెల్యే అనుచరులేనని పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. పిడుగురాళ్లకు చెందిన ముప్పన వెంకటేశ్వరరావును అంతమొందించేందుకు శ్రీనివాసరావు, వాసు అనే ఇద్దరు వ్యక్తులు పథక రచన చేశారు. వీరందరూ యరపతినేని అనుచరులే. అయితే, ఆధిపత్య పోరు కారణంగా వాసు, శ్రీనివాసరావులు ఎమ్మెల్యేకు దూరమయ్యారు. ఎమ్మెల్యేకు తాము దూరం కావడానికి వెంకటేశ్వరరావే కారణమని భావించిన వాసు, శ్రీనివాసరావులు అతడిని అంతమొందించాలని పథకం పన్నారు. విషయం తెలిసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.