ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించాల్సిన స్థానిక ఎన్నికలపై గత కొన్నిరోజులుగా రచ్చ కొనసాగుతుంది. ఎన్నికల సంఘం ఎన్నికలు జరపాలని ప్రయత్నాలు చేస్తుంటే , కరోనా నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించటం సరికాదని ప్రభుత్వం చెబుతోంది. ఈ అంశం రాష్ట్ర హైకోర్టులో ఉంది. ఈ సమయంలోనే ..స్థానిక ఎన్నికలపై వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు.
తిరుపతి ఉప ఎన్నిక పూర్తయ్యాక ఏప్రిల్, మే నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తమ పార్టీ పార్టీ సమాచారం అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఈ విషయాలను ప్రస్తావించారు. అలాగే ఉత్తరాంధ్రలో జులై 8న వైఎస్సార్సీపీ ప్లీనరీ నిర్వహిస్తామన్నారు. పార్టీపరంగా ప్రస్తుతం ఉన్న కమిటీలన్నీ రద్దవుతాయని, ప్లీనరీలో మళ్లీ నియామకాలు ఉంటాయన్నారు.
శ్రీకాకుళంలోని స్థానిక పార్టీ కార్యాలయంలోకార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో.. స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నది.. ఎప్పుడు నిర్వహించాలనుకున్నదన్న విషయంపై స్పష్టత వచ్చిందని చెప్పాలి. పార్టీ కార్యాలయాలకు సంబంధించి విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతి పార్టీకీ కేంద్ర కార్యాలయం కోసం 4 ఎకరాలు, జిల్లా కార్యాలయం కోసం 2 ఎకరాల చొప్పున కేటాయించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిబంధనలకు అనుగుణంగా స్థలాల కేటాయింపులు పూర్తయ్యాక త్వరలో 13 జిల్లాల్లో పార్టీ సొంత కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు.