ఎంఎల్ఏ కొడుక్కి రిమాండ్

మాదాపూర్ లో పోయిన నెల 29వ తేదీన జరిగిన ఓ ట్రాఫిక్ గొడవలో వైసిపి ఎంఎల్ఏ సామినేని ఉదయభాను కొడుకు సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ గొడవకు దిగాడు. ట్రాఫిక్ లో విధులు నిర్వహిస్తున్న ఓ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్ పై దౌర్జన్యం చేయటమే కాకుండా వారిని కలితో తన్నినందుకు వెంకట కృష్ణ ప్రసాద్ ను పోలిసులు అదుపులో తీసుకున్నారు.

మాదాపూర్ ప్రాంతంలో ఎంఎల్ఏ కొడుకు తన కుటుంబ సభ్యులతో వప్తున్నపుడు ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొద్దిసేపు వెయిట్ చేసిన ఎంఎల్ఏ కొడుకు వాహనంలో నుండి దిగి తాము వెంటనే వెళ్ళిపోవాలి కాబట్టి పంపించేయమంటూ గొడవకు దిగారు. ఒక్కో వాహనాన్ని పంపేస్తున్నామని కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పినందుకు ఎంఎల్ఏ కొడుకు తో పాటు ఎంఎల్ఏ భార్య, కూతురు కూడా ట్రాఫిక్ పోలీసులతో గొడవకు దిగారు.

ఎప్పుడైతే తల్లి, చెల్లెలు కూడా తనకు తోడయ్యారో వెంటనే కొడుకు రెచ్చిపోయి పోలీసులతో గొడవ పెట్టుకోవటమే కాకుండా  వాళ్ళని కాలితో తన్నారు. దాంతో ఇతర పోలీసులు జోక్యం చేసుకుని వాహనంతో పాటు కొడుకును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఉదయభాను భార్య, కూతురు రెచ్చిపోయి పోలీసులను బెదిరించిన వీడియోలు వైరల్ అయ్యాయి.

ఎంఎల్ఏ కొడుకును అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం ఏఎంఎం కోర్టులో ప్రవేశపెట్టినపుడు వెంకట కృష్ణ ప్రసాద్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. మొత్తానికి ఎంఎల్ఏ కొడుక్కి కూడా కోర్టు రిమాండ్ తరలించటం గమనార్హం. ఒకపుడు ప్రజా ప్రతినిధులను ముట్టుకోవటానికే పోలీసులు భయపడే రోజుల నుండి రిమాండ్ కు తరలించే స్ధాయికి చేరుకోవటం శుభపరిణామమే.