పేపర్ చదువుతుండగా ఎమ్మెల్యేకి గుండెపోటు… ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయాడు

పేపర్ చదువుతుండగా గుండెపోటు రావడంతో ఆ ఎమ్మెల్యే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. ఇంతలోనే అతను చనిపోయినట్టు వైద్యులు తేల్చారు. తమిళనాడులోని చైన్నైలో చోటుచేసుకుంది.

అన్నాడిఎంకే నేత కనగరాజ్… సులూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గురువారం ఉదయం ఇంట్లో పేపర్ చదువుతుండగా ఒక్కసారిగా ఆయన గుండె పోటుకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. కనగరాజ్ ను పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే చనిపోయినట్టు నిర్దారించారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తల్లో విషాద చాయలు అలుముకున్నాయి. 

తమిళనాడు అసెంబ్లీలో 2016 నుంచి ఇప్పటివరకూ ఓ డీఎంకే, నలుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చనిపోయారు. నివేల్‌, ఏకే బోస్‌ (తిరుప్పరంగుండ్రం), జయలలిత (ఆర్కే నగర్‌) కరుణానిధి (తిరువారూర్‌), కనగరాజ్‌ (సులూరు) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. తమిళనాడు అసెంబ్లీలో ఏకంగా 10 శాతం ఖాళీలు ఉండటం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ప్రస్తుతం కనగరాజ్ మరణంతో తమిళనాడు అసెంబ్లీలో 22 ఖాళీలు ఏర్పడ్డాయి.