Nara Lokesh: తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. మంగళవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జిలతో ఆయన భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు.
నాయకత్వానికి సిద్ధాంతాలే అసలైన బలమని లోకేశ్ ఉద్ఘాటించారు. “ఎన్టీఆర్, చంద్రబాబుల ఆశయ సాధనే మన మార్గం. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వెనుక ఉన్న పార్టీ మూల సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలి. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రత్యేక సమయాన్ని కేటాయించాలి” అని ఆయన సూచించారు. పార్టీ నిర్దేశించిన ఆరు ముఖ్య సిద్ధాంతాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాలని ఆదేశించారు.
రెడ్ బుక్ – సమాజం బాగు కోసమే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలను ప్రస్తావిస్తూ లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రెడ్ బుక్ అనేది కేవలం ప్రతీకారం కోసం కాదు, సమాజం బాగు కోసం, చట్టాన్ని అతిక్రమించిన వారిని బోనులో నిలబెట్టడానికేనని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం ‘రాజారెడ్డి రాజ్యాంగం’తో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంపై దాడి, చంద్రబాబు ఇంటిపై దాడి వంటి ఘటనలను ఆయన గుర్తు చేశారు.

జగన్ అండ్ కో వైఫల్యాలపై ఫైర్:- వైసీపీ పాలనలో జరిగిన అమానవీయ ఘటనలపై లోకేశ్ నిప్పులు చెరిగారు. “డాక్టర్ సుధాకర్, కోడెల శివప్రసాద్, చిన్నారి మిస్బా మరణాలకు జగన్ అండ్ కో వేధింపులే కారణం. అమర్నాథ్ గౌడ్, అబ్దుల్ సలాం, తోట చంద్రయ్యలను వెంటాడి వేధించారు. అధికారం ఉన్నప్పుడు హత్యలు, అవినీతితో చెలరేగిపోయిన వారు.. ఇప్పుడు అధికారం పోయాక కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారు” అని దుయ్యబట్టారు.
వైసీపీ ఫేక్ ఫ్యాక్టరీని తిప్పికొట్టండి:- వైసీపీ సోషల్ మీడియా వేదికగా సాగిస్తున్న ప్రచారాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. “వైసీపీ ఫేక్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే అసత్య సమాచారాన్ని ఐకమత్యంతో ఎదుర్కోవాలి. ఏ ఆత్మ చెప్పిందో కానీ, జగన్ ఇప్పుడు ‘గన్’ అంటూ కలవరిస్తున్నారు” అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు.
కార్యకర్తలకు అండగా ప్రభుత్వం:- సీఎం చంద్రబాబుతో పాటు తాను కూడా వారానికి ఒకరోజు పార్టీ కార్యాలయంలో గడుపుతూ ప్రజా సమస్యలు వింటున్నామని లోకేశ్ తెలిపారు. కార్యకర్తల మధ్య ఐక్యత, క్రమశిక్షణ ఉంటేనే దీర్ఘకాలిక రాజకీయ విజయాలు సాధ్యమవుతాయని, సిద్ధాంతపరంగా ఎదిగిన నాయకత్వమే పార్టీ భవిష్యత్తు అని ఆయన స్పష్టం చేశారు.

