వంగవీటి రాధా ఎఫెక్ట్, పలువురు కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా

మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ కాపు నేత వంగవీటి రాధాకృష్ణ వైసిపికి రాజీనామా చేయడంతో ఆయన మద్దతుదారులు కూడా జగన్ కు గుడ్ బై చెబుతున్నారు. రాధాకృష్ణకు మద్దతుగా ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేసి లేఖలను వైసీపీ కార్యాలయానికి పంపారు. విజయవాడ కార్పొరేషన్‌లోని 24వ డివిజన్ కార్పొరేటర్ చందన సురేశ్, 17వ డివిజన్ కార్పొరేటర్ చోడిశెట్టి సుజాత, 15వ డివిజన్ కార్పొరేటర్ దామోదర్, 16వ డివిజన్‌ కార్పొరేటర్‌ మద్దాల శివశంకర్‌, 18వ డివిజన్‌ కార్పొరేటర్ పాల ఝాన్సీలక్ష్మిలు వైసీపీకి రాజీనామా చేశారు. అనంతరం వారు మాట్లాడారు. తాము రాధా నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నామని, ఆయనే వెంటే ఉంటామని స్పష్టం చేశారు. రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తమ పూర్తి మద్దతు, సహకారం ఉంటాయని చెప్పారు. రాధా అండ్ కో పార్టీని వీడుతుండడం, వారంతా టిడిపి లోకి వెళ్లేయోచనలో ఉండటం వల్ల కృష్ణా జిల్లాలో వైసీపీకి ఏమేరకు ఎదురు దెబ్బ తగులుతుందనే ది ఇపుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది.