TDP MLC Candidates: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఖరారు.. ఈసారి లక్కీ ఛాన్స్ ఎవరికంటే?

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చివరి జాబితా ఖరారైనట్లు తెలుస్తోంది. మొత్తం ఐదు స్థానాలు కూటమికే దక్కనున్న నేపథ్యంలో జనసేన నుంచి నాగబాబుకు, బీజేపీ నుంచి మాధవ్‌కు అవకాశం దాదాపు ఖాయమైంది. ఇక మిగతా మూడు స్థానాలు టీడీపీ కోటాలో ఉన్నాయి. వీటికి సీనియర్ నేతలు సహా కొత్త వారికీ పోటీ పెరిగింది. ఇందులో దేవినేని ఉమామహేశ్వరరావుకు ఎమ్మెల్సీగా అవకాశం దాదాపు ఖాయమైంది. గతంలో మంత్రిగా ఉన్న ఆయన, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం వెనకంజ వేశారు. ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఆయన పేరు మద్దతుతో వినిపిస్తోంది.

ఇక మరో కీలక నేత బుద్ధా వెంకన్న కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై గట్టి విమర్శలు చేసిన ఆయన, ఎమ్మెల్యే టికెట్ ఆశించినా దక్కలేదు. దీంతో పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని భావిస్తోంది. అలాగే, బీసీ కోటాలో బీద రవీంద్ర పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణకు ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్న నేపథ్యంలో పార్టీ ఆయనకు మద్దతుగా నిలిచే అవకాశముంది.

కాపు సామాజిక వర్గంలో కీలక నేత వంగవీటి రాధా కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో పార్టీ నిర్ణయం మేరకు పోటీకి దూరంగా ఉన్న రాధా, కూటమి విజయానికి కృషి చేశారు. దీంతో ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలన్న చర్చ కొనసాగుతోంది. మరోవైపు, పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్‌కు అవకాశం కల్పించేందుకు తన స్థానాన్ని వదులుకున్న వర్మకు ఈసారి నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తోంది. సమీకరణాల దృష్ట్యా ప్రస్తుతం ఆయన పేరు వెనుకబెట్టినట్లు తెలుస్తోంది. అయితే, స్థానిక సంస్థల కోటా లేదా గవర్నర్ నామినేషన్ ద్వారా భవిష్యత్తులో అవకాశం కల్పించే యోచనలో టీడీపీ హైకమాండ్ ఉన్నట్లు సమాచారం.

మొత్తంగా, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఆసక్తికరంగా మారింది. పార్టీ సమీకరణాలు, సామాజిక సమతుల్యతను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో ఎంపికైన నేతలు శాసన మండలిలో పార్టీ పక్షాన తమ పాత్రను ఎలా నిర్వర్తిస్తారో చూడాలి.

Public Reaction On Pawan Kalyan Comments Over Ys Jagan Walkout from Assembly || Ap Public Talk || TR