తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి పుత్రరత్నం, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ త్వరలో ‘యువగళం’ పేరుతో పాదయాత్ర ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఆ పాదయాత్రకు సంబంధించిన పేరు ప్రకటితమైన వెంటనే, అనూహ్యంగా నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు యాత్ర సందర్భంగా అపశృతి చోటు చేసుకుని, 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ అనూహ్య ఘటనతో ఒక్కసారిగా టీడీపీ షాక్కి గురయ్యింది. ‘పోలీసులు సహకరించకపోవడం వల్లే ఈ దుస్థితి..’ అంటూ చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు కనీ వినీ ఎరుగని రీతిలో ఆర్థిక సాయాన్ని కూడా చంద్రబాబు ప్రకటించేశారు. కేంద్రం, రాష్ట్రం కూడా స్పందించి, ఆర్థిక సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ ఘటనలో కుట్ర కోణం వుందని టీడీపీ అనుమానిస్తోంది. ‘ఇరుకు సందుల్లో బహిరంగ సభలేంటి.?’ అన్న ఆత్మ విమర్శ చేసుకోకుండా, అధికార వైసీపీ మీదకు ఎదురుదాడికి యత్నిస్తోంది తెలుగుదేశం పార్టీ. ఇదెక్కడి వింత వాదన.? అంటే, టీడీపీ తీరే అంత.. అని చెప్పుకోవాలి.
కాగా, టీడీపీలో కొందరు నేతలైతే, ‘ఇది చినబాబు ఐరన్ లెగ్గు మహిమ..’ అంటూ ఆఫ్ ది రికార్డుగా చర్చించుకుంటున్నారట. ‘లోకేష్ వల్లనే టీడీపీకి ఈ దుస్థితి..’ అంటూ చాలామంది సీనియర్లు, టీడీపీ పతనంపై చాలాకాలంగా ఆరోపిస్తూ, టీడీపీని వీడి వేరే పార్టీల వైపు చూస్తున్న సంగతి తెలిసిందే.
‘యువగళం’ పేరులోనే ఊపు లేదనీ, ఆ పేరుని ప్రకటించిన వెంటనే అపశకునం చోటు చేసుకుందనీ టీడీపీలోనే చర్చ జరుగుతోంటే, ఈ డ్యామేజీ నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక చంద్రబాబు తలపట్టుక్కూర్చోవాల్సి వస్తోంది.
