బిజెపి, జగన్, పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన లోకేష్

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన ధర్మ పోరాట దీక్ష సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ సభలో మాట్లాడిన లోకేష్ కేంద్ర ప్రభుత్వం బిజెపిపై మండి పడ్డారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా స్పెషల్ స్టేటస్ ఇస్తామని మభ్యపెట్టారు. పోనీ అదైనా ఇచ్చారా అంటే అది కూడా ఇవ్వకుండా మోసం చేశారన్నారు.

చంద్రన్నది ధర్మ పోరాటం అయితే…మోదీది అధర్మ పోరాటం. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం 30 సార్లు ఢిల్లీ వెళ్లినా న్యాయం చేయలేదు. నాలుగు సంవత్సరాలు అయ్యాక ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చి మనకు ద్రోహం చేశారన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రశ్నిస్తే ఎప్పుడో జరిగిన బాబ్లీ కేసుతో ఈనాడు ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు లోకేష్.

రైల్వే జోన్ అడిగితే బిజెపి ఎంపీ ఈడి దర్యాప్తు ప్రారంభిస్తామని చెబుతారు. కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ ఏది అని అడిగితే మీపైన సిబిఐ దర్యాప్తు పెడతామంటారు. ఎందుకు మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారు? ఏం తప్పు చేశామని బెదిరిస్తున్నారు అని ప్రశ్నించారు లోకేష్. ఆంద్ర రాష్ట్ర హక్కుల కోసమే టిడిపి పోరాడుతుందన్నారు.

ప్రధానమంత్రి అమరావతి వచ్చినప్పుడు ఢిల్లీ కంటే అమరావతిని అద్భుతమైన రాజధానిని చేస్తానన్నారు. కానీ రాజధానికి 1500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు అని వ్యాఖ్యానించారు లోకేష్. రాష్ట్రంలో వైసిపి ఓ డ్రామా కంపెనీ. బీజేపీ… బి అంటే బీజేపీ, జె అంటే జగన్, పి అంటే పవన్ గా అయిందన్నారు లోకేష్. కర్ణాటక ఎన్నికలు ట్రైలర్ మాత్రమే… అసలైన సినిమా బీజేపీకి 2019 ఎన్నికలలో చూపించనున్నారు తెలుగు ప్రజలు.