ఎన్టీయార్ పరువు తీస్తోన్న లక్ష్మీపార్వతి.!

స్వర్గీయ ఎన్టీయార్ ఆమెను తన భార్యగా ప్రకటించారు.! కానీ, ఆమె వల్లనే తెలుగుదేశం పార్టీ నాషశనమైపోయిందని అప్పట్లో పెద్ద యాగీ జరిగింది. అదే, స్వర్గీయ ఎన్టీయార్ రాజకీయానికి చరమగీతం పాడింది.! ఆయన మరణానికీ కారణమైంది. లేటు వయసులో, స్వర్గీయ ఎన్టీయార్.. తన మనసుకు నచ్చిన లక్ష్మీపార్వతిని పెళ్ళాడారు.

అంతకు ముందు బసవతారకంతో స్వర్గీయ ఎన్టీయార్‌కి వివాహం జరగడం, అదంతా వేరే కథ. ఆమె అనారోగ్యంతో కన్నుమూశాక, చాలాకాలం ఒంటరిగా వుండిపోయారు ఎన్టీయార్. కన్న బిడ్డలు తనను పట్టించుకోవడంలేదనో, ఇంకో కారణం వల్లనో లక్ష్మీపార్వతికి దగ్గరయ్యారాయన.

కాదు కాదు, ఎన్టీయార్‌ని వలలో వేసుకుని, టీడీపీని దెబ్బ తీసేందుకు లక్ష్మీపార్వతి కుట్ర చేశారని.. ఇంకో వాదన వుంది. ఎవరి గోల వారిదే.! ఏదైనాగానీ, పోయినోళ్ళంతా మంచోళ్ళేనని పెద్దలు చెబుతుంటారు. దురదృష్టం, యుగపురుషుడు ఎన్టీయార్ మరణించాక, ఆయన్ని ‘కామారావు’గా మార్చేస్తున్నారు.

‘మీ నాన్న నన్ను పెళ్ళి చేసుకున్నారా.? లేదా.? చేసుకోకపోతే, నాతో మీ నాన్న చేసింది సంసారం కాదా.? అలాగైతే, ఆయనెలా యుగ పురుషుడవుతారు.?’ అంటూ ఈ రోజు లక్ష్మీ పార్వతి మీడియా సమావేశంలో ప్రశ్నించిన తీరు, ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడేలా చేసింది.

స్వర్గీయ ఎన్టీయార్ పేరుతో వంద రూపాయల నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. స్వర్గీయ ఎన్టీయార్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జూనియర్ ఎన్టీయార్, కళ్యాణ్ రామ్ మాత్రం హాజరు కాలేదు. లక్ష్మీపార్వతికి ఆహ్వానం అందలేదట.

తనకు ఆహ్వానం అందకపోవడంతో పై విధంగా అసహనం వెల్లగక్కారు లక్ష్మీపార్వతి.