టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా రామ్మోహన్  ?

మొన్నటి ఎన్నికల్లో కుదేలైన తెలుగుదేశంపార్టీ రాష్ట్ర పగ్గాలు తొందరలో మరో యువనేత చేతికి అందుతోందా ? పార్టీ వర్గాల ప్రకారమైతే అవుననే సమాధానం వస్తోంది. శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పచెప్పాలని చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నారట.

ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షునిగా మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎచ్చర్లలో ఆయన ఓడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో నాయకత్వ బాధ్యతలు యువకుల చేతికి ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నట్లు సమాచారం. దాంతో రామ్మోహన్ సరైన నేతగా చంద్రబాబు డిసైడ్ అయ్యారు.

రామ్మోహన్ కూడా మొన్న రెండోసారి ఎంపిగా గెలిచారు. దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు కొడుకుగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసినా కొద్ది కాలంలోనే పార్టీలో చొచ్చుకుపోయారు. తెలుగుతో పాటు ఇంగ్లీషు, హింది భాషపైనా రామ్మోహన్ మంచి పట్టుంది. విషయ పరిజ్ఞానం ఉన్న నేతగా పార్టీలో మంచి పేరుంది. పైగా ఉత్తరాంధ్రలోని బలమైన సామాజికవర్గమైన బిసి నేత. అందుకనే చంద్రబాబు రామ్మోహన్ విషయంలో మొగ్గు చూపినట్లు సమాచారం.