కన్నా స్థాయి పెరిగిందా.. బాబు స్థాయి తగ్గిందా?

ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. మంగళగిరి తెలుగుదేశం కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు ఆయనకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే… ఈ సందర్భంగా బాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి!

కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడంతో బాబు తెగ మురిసిపోతున్నట్లున్నారు! ఈ సందర్భంగా తనస్థాయిని మరిచిపోయి మరీ కన్నాను ఆకాశానికెత్తేశారు చంద్రబాబు. అవును… కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడం శుభపరిణామని మొదలుపెట్టిన బాబు… పదేళ్లపాటు ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి టీడీపీలో చేరడం సంతోషమని చెబుతూ… కన్నా రాకతో టీడీపీ అధికారంలోకి వచ్చేసిందా అనే వాతావరణం కనిపిస్తుందనేశారు!

అంటే… పొరపాటున కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరి ఉండకపోతే చంద్రబాబుకి ఆ కాంఫిడేన్స్ వచ్చి ఉండేది కాదా? ఇప్పటివరకూ ఉన్న నేతలు – ఇకపై రాబోయే నేతల కంటే… కన్నానే కీలకం అని బాబు చెప్పదలచుకున్నారా? ప్రస్తుతం కన్నా రాకను వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతల ఆలోచన ఇది! ఈ విషయంలో రాయపాటి సాంబశివరావు లాంటి వారు బహిరంగంగానే అనేసినా… అలా పైకి చెప్పలేని వారు చాలానే ఉన్నారనేది మరో కామెంట్!

పైగా… ఒక నాయకుడి వచ్చి చేరినంత మాత్రాన్న… బాబు గారు మరీ అంత దిగజారి పొగడాల్సిన అవసరం ఏముంది? అనేది మరికొంతమంది చంద్రబాబు ఫ్యాన్స్ ఫీలింగ్ గా ఉందట. దీంతో… కన్నా స్థాయి పెరిగిందా.. లేక, బాబు స్థాయి తగ్గిందా? అని గుసగుసలాడుకుంటున్నారంట!

కాగా… కాగా కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి 1989 – 1994 – 1999 – 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించగా.. 2009లో గుంటూరు పశ్చిమ నుంచి గెలిచారు. అనంతరం 2014లో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2019లో నరసరావుపేట నుంచి బీజేపీ ఎంపీ బరిలో నుంచుని ఓటమి పాలయ్యారు.