పవన్ పిలుపు బూమరాంగ్… థ్యాంక్స్ చెబుతున్న వైసీపీ నేతలు!

జనసేన అధినేత వారాహి యాత్ర రెండో దశ అనంతరం ఫుల్ జోష్ మీద కనిపిస్తోన్న పవన్ కల్యాణ్… గడిచిన శనివారం జనసైనికులకు గట్టి పిలుపునిచ్చారు. శనివారం ఉదయం నుంచి ప్రతీ జనసేన కార్యకర్త జగనన్న కాలనీలు దర్శించాలని తెలిపారు. వర్షాల వల్ల నీట మునిగిన కాలనీల ఫోటోలు పెట్టాలని సూచించారు.

దీంతో… పవన్ కల్యాణ్ పిలుపు బూమరాంగ్ అయినట్లే ఉందని అంటున్నారు పరిశీలకులు. అదెలాగంటే… శనివారం ఉదయం నుండి రాత్రివరకు వర్షాల కారణంగా జగనన్న కాలనీల పరిస్థితులను వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్‌ లోడ్ చేయాలని పవన్ పిలుపిచ్చారు. సోషల్ మీడియాతో పాటు జనసేన ట్విట్టర్ ఖాతా, పార్టీ వెబ్‌ సైట్‌ లో కూడా అప్‌ లోడ్ చేయాలన్నారు.

దీంతో అధినేత పిలుపు ప్రకారం నేతలు, కార్యకర్తలు రెండో ఆలోచన లేకుండా కాలనీల మీద పడ్డారు. అధినేత చెప్పినట్లే వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాతో పాటు పార్టీ ట్విట్టర్ ఖాతాతో పాటు వెబ్‌ సైట్‌ లో కూడా అప్‌ లోడ్ చేశారు. అయితే ఈ విషయంపై దేశం మొత్తం మునిగిన చోట జగనన్న కాలనీలు మాత్రం మునగవా అంటూ కామెంట్లు వినిపించాయి.

దేశరాజధాని, హైదరాబాద్, బెంగళూరు వంటి సిటీలే వరద నీటిలో మునిగి తేలితే… ఖాళీ స్థాలాలుగా ఉన్న జగనన్న కాలనీల్లోని ఫ్లాట్లలో వర్షపు నీరు కనిపిస్తే తప్పా అనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా దర్శన మిచ్చాయి. ఆ సంగతి అలా ఉంటే… ఇది పరోక్షంగా జగన్ కు ప్లస్ అయ్యిందని అంటున్నారు పరిశీలకులు.

అవును… జగనన్న కాలనీల విషయంలో జనసేన ఒకటి ఆలోచిస్తే చివరకు జరిగింది మరొకటిగా తయారైందని తెలుస్తోంది. ఇప్పుడు జనసేన చేసిన పనివల్ల రాష్ట్రంలోని ఎన్ని నియోజకవర్గాల్లో జగనన్న కాలనీలు కడుతున్నారన్న విషయం జనాలందరికీ తెలిసిందని అంటున్నారు. సుమారు 50 నియోజకవర్గాల్లో నిర్మాణాల్లో ఉన్న జగనన్న కాలనీల ఫొటోలు, వీడియోలో ప్రస్తుతం జనసేన వెబ్‌ సైట్, ట్విట్టర్ ఖాతాలో వైరల్ అవుతున్నాయి.

ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఈ మేరకు ప్రతీ నియోజకవర్గం, మండలం, గ్రామం పేరు సైతం ప్రస్థావిస్తూ కనిపిస్తోన్న ప్రతీ పోస్టూ జగన్ కు ప్లస్ అనే మాటలు వినిపిస్తున్నాయి. జగనన్న కాలనీలు కట్టడంలేదని, ఇళ్ళ నిర్మాణాలు జరగటమే లేదని చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు, దగ్గుబాటి పురందేశ్వరి పదేపదే చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు తాజా వీడియోలు, ఫొటోలు సమాధానం ఇచ్చినట్లయ్యిందని అంటున్నారు.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు, జనసేన నేతలు అంతా ఒకరోజంతా కష్టపడి జగన్ సర్కార్ కి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చారని.. ఫలితంగా జగనన్న కాలనీలకు ఇక పబ్లిసిటీ అవసరం లేదని అంటున్నారు. దీంతో.. పరోక్షంగా పిలుపునిచ్చిన పవన్ కు.. ఫాలో అయిన కార్యకర్తలకూ థాంక్స్ చెబుతున్నారంట వైసీపీ నాయకులు!