సంస్ధేదైనా అధికారం మాత్రం వైసిపిదే

ఎగ్జిగ్ పోల్ నిర్వహించిన సంస్ధల ఫలితాలతో హోరెత్తిపోతోంది. జాతీయ రాజకీయాలను పక్కనపెడితే రాష్ట్రం వరకూ వైసిపిదే అధికారం అని తేలిపోయింది. ఒక్క లగడపాటి నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో తప్ప ఇక ఏ సంస్ధ నిర్వహించిన సర్వేలో కూడా చంద్రబాబునాయుడు సిఎం అవుతాడని కాలేదు. సరే లగడపాటి నిర్వహించిన ఎగ్జిట్ పోలంటే అందరికీ తెలిసిందే అదెలాగుంటుందో. మొన్న తెలంగాణా ఎన్నికలతో లగడపాటి తన క్రెడిబులిటీని తానే చెడగొట్టుకున్నాడు.

ఇండియా టు డే, ఏబిఎన్ నీల్సన్, సిఎన్ఎన్ ఐబిఎన్, సీపిఎస్, ఆరా ఇలా.. ఏ సంస్ధ ఎగ్జిట్ పోల్ సర్వే తీసుకున్నా  ఫలితం మాత్రం వైసిపిదే అధికారం అని తేలిపోయింది.  ఎగ్జిట్ పోల్ సర్వే అని చెబుతున్నా ఫలితాలు దాదాపు ప్రీ పోల్ సర్వేకి దగ్గరగానే ఉన్న విషయాన్ని గమనించాలి.  జాతీయ మీడియా నిర్వహించిన ప్రీపోల్  సర్వేలో కూడా అధికారం వైసిపిదే అని తేలిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది.

ఎగ్జిట్ పోల్ నిర్వహించిన సంస్ధల్లో అత్యధికంగా దాదాపు 135 స్ధానాలను ఆరా సంస్ధ వైసిపికి వస్తుందని తేల్చింది. తక్కువలో తక్కువగా ఏఎంసి సంస్ధ వైసిపికి 105 సీట్లు వస్తుందని అంచనా వేసింది. ఇదే దామాషాలో దాదాపు 20 ఎంపి సీట్లను వైసిపి గెలుచుకుంటుందని అంచనా వేశాయి.

సరే ప్రీ పోల్ సర్వే అయినా, ఎగ్జిట్ పోల్ సర్వే అయినా నూటికి 100 శాతం నిజమవుతుందని అనుకునేందుకు లేదు. సర్వేలు తప్పయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎక్కువసార్లు అంచనాలకు దగ్గర దగ్గరలో ఉంటాయనటంలో సందేహం లేదు.  కాకపోతే సర్వే నిర్వహించిన సంస్ధ విశ్వసనీయత మీద ఆధారపడుంటుంది ఫలితం.