రేవంత్ భార్యను బ్యాంకుల చుట్టూ తిప్పిన ఐటీ అధికారులు

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 3 రోజుల సెర్చ్ వారెంట్ తో వచ్చిన అధికారులు సుమారు 30 గంటలుగా సోదాలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు నిన్న సాయంత్రం ఇంటికి చేరుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు అధికారులు రేవంత్ ని ప్రశ్నిస్తూనే ఉన్నారు.

రేవంత్ తో పాటు ప్రస్తుతం ఆయన నివాసంలో ఉదయ్ సింహా కూడా ఉన్నారు. ఉదయ్ సింహ రేవంత్ రెడ్డితో పాటు ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. రెండో రోజు ఐటి అధికారులు రేవంత్ రెడ్డి బ్యాంకు ఖాతాలు, లాకర్లపై దృష్టి పెట్టారు. రేవంత్ తో పాటు ఆయన భార్య గీతా రెడ్డి, ఆయన తమ్ముడు కొండల్ రెడ్డి బ్యాంకు లాకర్లు చెక్ చేస్తున్నారు. దీనికోసం గీతారెడ్డిని బ్యాంకుకు తీసుకెళ్లారు ఐటి అధికారులు. లాకర్లు ఓపెన్ చేసి అందులో ఉన్న డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఐటి అధికారులతోపాటు రేవంత్ నివాసంలో ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఫెమా, మనీ ల్యాండరింగ్ చట్టాలను ఉల్లంఘించినట్టు ఆరోపణలు, విదేశాల నుంచి హవాలా మార్గం ద్వారా డబ్బులు తీసుకొచ్చారని, సూట్ కేసు కంపెనీలు క్రియేట్ చేశారన్న నేపథ్యంలో ఫోరెన్సిక్ అధికారులు డాక్యుమెంట్లు, సంతకాలు వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.

సోదాలు నిర్వహిస్తూనే రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు అధికారులు. మరో ఇద్దరు ఐటి అధికారులు రేవంత్ నివాసానికి చేరుకున్నారు. 20 గంటలుగా రేవంత్ విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు, వాటి ఆధారంగా రేవంత్ ను ప్రశ్నిస్తున్నారు.