అక్రమనిర్మాణాలపై జనాలను రెచ్చ గొడుతున్నారా ?

తనకు రక్షణగా చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై సామాన్య జనాలను రెచ్చగొడుతున్నట్లే ఉంది. కరకట్ట మీద నిర్మించిన అక్రమకట్టడాలపై అసెంబ్లీ చర్చ జరిగింది. ఆ సందర్భంగా చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ఏ విధంగా అక్రమనిర్మాణమో జగన్మోహన్ రెడ్డి వివరించారు.

దానికి చంద్రబాబు బదులిస్తూ ప్రజావేదికను కూల్చేయటంపై ప్రస్తావించారు. తనపై వ్యక్తిగత కక్షతోనే ప్రజావేదికను కూల్చేసినట్లు ఆరోపించారు. ప్రభుత్వం ప్రజావేదికను కూల్చేయటంతో జనాలందరూ భయపడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి ప్రజావేదికను కూల్చేస్తే మామూలు జనాలు ఎందుకు ఆందోళన పడుతున్నారో అర్ధం కావటం లేదు.

అంతసేపు మాట్లాడిన చంద్రబాబు తాను నివాసముంటున్న అక్రమ నిర్మాణం నుండి ఖాళీ చేస్తానని మాత్రం చెప్పలేదు. పైగా తాను ఖాళీ చేయనని పరోక్షంగా చెబుతునే ఏం చేసుకుంటారో చేసుకోండన్నట్లుగా సవాలు విసరటం విచిత్రంగా ఉంది.  ప్రజా సమస్యల పరిష్కారానికి అవసరమైతే నడిరోడ్డు మీద పడుకోవటానికి కూడా సిద్ధమే అంటూ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

హోలు మొత్తం మీద చంద్రబాబు చెప్పిందేమిటంటే అక్రమనివాసం నుండి తాను ఖాళీ చేయబోనని చెప్పినట్లే ఉంది. తాను నివాసముంటున్న భవనాన్ని తాను నిర్మించలేదని, తనకు ఎక్కడా అక్రమంగా స్ధలం తీసుకోలేదని చెబుతున్నారే కానీ అక్రమంగా నివసించిన భవనంలో నివాసముంటున్న విషయాన్ని మాత్రం ఒప్పుకోవటం లేదు.